ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశాలన్నింటికీ క్రిప్టో కరెన్సీలు అత్యంత ప్రమాదకరం

national |  Suryaa Desk  | Published : Tue, Apr 19, 2022, 11:43 PM

దేశాలన్నింటికీ క్రిప్టో కరెన్సీలు అత్యంత ప్రమాదకరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. అమెరికాలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నిర్వహిస్తోన్న ‘వసంత కాల సదస్సు’లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సదస్సులో క్రిప్టో కరెన్సీలపై నిర్మలా సీతారామన్ విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో పాల్గొన్న దేశాలన్నింటికీ క్రిప్టో కరెన్సీలు అత్యంత ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులకు, మనీ లాండరింగ్‌కు ఈ కరెన్సీలను వాడుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. వీటికి చెక్ పెట్టేందుకు ఉన్న ఒకే ఒక్క పరిష్కారం టెక్నాలజీ ద్వారా నియంత్రించడమేనని పేర్కొన్నారు. టెక్నాలజీ ద్వారా రెగ్యులేట్ చేయడంలో దేశాలు వెనక్కి తగ్గకూడదని, దీని నియంత్రణలోకే అన్నింటిని తీసుకురావాలని అన్నారు. ఒకవేళ ఏదైనా దేశం తనకు తానుగా ఈ కరెన్సీలను నిర్వహించగలమని భావిస్తే.. అది అసాధ్యమని నిర్మలా చెప్పారు. అన్ని దేశాలు కలిసి కట్టుగా ఈ కరెన్సీలపై పోరాడాల్సిందేనని పిలుపునిచ్చారు.


క్రిప్టో లావాదేవీలకు పన్ను..


క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై ఓ కన్నేసి ఉంచేందుకు.. ప్రభుత్వం వీటిపై 30 శాతం పన్నును విధిస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దీంతో ఎవరెవరు ఈ లావాదేవీల్లో భాగస్వాములవుతున్నారో తెలుసుకుంటోందని చెప్పారు. ఎలక్ట్రానిక్ విధానంలో జరుగుతోన్న లావాదేవీలను తామెలా ట్రాక్ చేయగలమని..? అందుకే వీటిపై పన్ను విధించి, ఎవరు వీటిని కొంటున్నారు..? ఎవరు వీటి విక్రయిస్తున్నారో తెలుసుకుంటున్నామని తెలిపారు.


భారత్‌లో డిజిటలైజేషన్..


గత కొన్నేళ్లుగా భారత్‌ను డిజిటలైజేషన్‌గా మార్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు నిర్మలా సీతారామన్ ఈ సదస్సులో చెప్పారు. టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో భారత్ చాలా మెరుగైన స్థాయిలో ఉందని పేర్కొన్నారు. 2019 డేటాను చూసుకుంటే.. భారత్‌లో డిజిటైజేషన్ రేటు 95 శాతంగా ఉందని, అదే రేటు ప్రపంచవ్యాప్తంగా 64 శాతమేనని పేర్కొన్నారు. టెక్నాలజీని తేలికగా వాడుకోగలమని కరోనా మహమ్మారి మనకు నేర్పిందని, సామాన్య ప్రజలు కూడా దీన్ని తేలిగ్గా వాడుకోవచ్చని చెప్పారు.


భారత్ ప్రస్తుతం అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను కలిగి ఉందని ఈ మీటింగ్ సందర్భంగా మంత్రి చెప్పారు. భారత్‌లో ఉన్న ప్రతి 4 స్టార్టప్‌లలో ఒకటి ఫిన్‌టెక్‌ అని, ఇవి యూనికార్న్‌లుగా వృద్ధి సాధిస్తున్నట్టు వెల్లడించారు. గత మూడు నుంచి నాలుగేళ్లలో దేశంలో 20 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా(1 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ వాల్యుయేషన్ పెరగడం) మారాయని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa