ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా కానుకలు నా ఇష్టం: ఆరోపణలను నిజం చేసిన ఇమ్రాన్ ఖాన్

international |  Suryaa Desk  | Published : Tue, Apr 19, 2022, 11:45 PM

తనపై వచ్చిన ఆరోపణలను తానే రుజువు చేసుకొన్నాడు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఇదిలావుంటే పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు దేశ విదేశాల నుంచి అందుకున్న కానుకలను ప్రభుత్వ ఖజానాకు అప్పగించకుండా వాటిని తనవద్దే ఉంచుకోవడమే కాకుండా వాటిలో కొన్నింటిని అమ్ముకున్నారని ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు కూడా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో తనపై చేస్తున్న విమర్శలకు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఘాటుగా స్పందించారు. తనకు వచ్చిన కానుకలు తనకే సొంతమని.. వాటిని ఏమైనా చేసుకునే హక్కు తనకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.


దేశాధినేతలకు వచ్చిన కానుకలు, బహుమతులను నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. అయితే, రూ.కోట్ల విలువ చేసే కానుకలను ఇమ్రాన్‌ ఖాన్‌ అమ్ముకున్నాన్న పాకిస్థాన్ ప్రధాని సహా అధికార పీఎంఎల్‌ఎన్‌ చేస్తున్న ఆరోపణలను ఇమ్రాన్‌ ఖాన్‌ తోసిపుచ్చారు. ఆయన జియో న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘అవన్నీ నిరాధారమైన ఆరోపణలు.. నిబంధనల ప్రకారం వాటి విలువలో 50 శాతం మొత్తాన్ని ఖజానాకు చెల్లించి కానుకలు తీసుకున్నాను.. ఒకవేళ తాను అవినీతికి పాల్పడినట్లు ఎవరైనా ఆధారాలు చూపిస్తే తాను కూడా అందుకు సిద్ధమవుతా. మూడేళ్ల పాలనలో నేను కానుకల కుంభకోణానికి పాల్పడినట్టు ఈ ఒక్క ఆరోపణ మాత్రమే చేయగలిగినందుకు చాలా సంతోషం..వారికి నా కృత‌జ్ఞ‌త‌లు’ అని వ్యాఖ్యానించారు.


‘‘అధ్యక్షుడు పంపిన బహుమతిని నా ఇంటిలో ఉంచుకున్నాను... నేను తోషకానా (ఖజానా) నుంచి తీసుకున్న ప్రతి వస్తువూ రికార్డ్‌లో ఉంది. వాటి ధరలో 50 శాతం చెల్లించిన ఆ బహుమతులను కొనుగోలు చేశాను.. నేను డబ్బు కోసమే అయితే నేను నా ఇంటిని క్యాంపు కార్యాలయంగా ప్రకటించవచ్చు.. కానీ నేను అలా చేయలేదు’’ అని అన్నారు.


ప్రధాని హోదాల అందుకున్న కానుకలను ఇమ్రాన్‌ ఖాన్‌ దుబాయిలో అమ్మేశారని పాక్‌ ప్రస్తుత ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇటీవల ఆరోపించారు. అలాగే, ఓ ఖరీదైన నెక్లెస్‌ను కూడా రూ.18 కోట్లకు తన సన్నిహితుడు ద్వారా అమ్మినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇక, ‘ది న్యూస్‌ ఇంటర్నేషనల్‌’ పత్రిక నివేదిక ప్రకారం మూడున్నరేళ్లలో ఇమ్రాన్‌ దాదాపు 58 ఖరీదైన బహుమతులను కానుకగా అందుకున్నారు.


అయితే వాటిని తమ దగ్గరే ఉంచుకోవాలని భావిస్తే వస్తువుల ఖరీదులో సగం ధరను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇమ్రాన్ మాత్రం ఆ వస్తువులకు నామమాత్రంగా చెల్లించారు. రూ.38 లక్షల రొలెక్స్‌ గడియారానికి రూ.7,54,000, రూ.15 లక్షల విలువ చేసే మరో రొలెక్స్‌ వాచీకి రూ.2,94,000 మాత్రమే చెల్లించి సొంతం చేసుకున్నారు. ఇలా మూడోవంతు కంటే తక్కువగా చెల్లించి, పలు కానుకలను ఇమ్రాన్ ఖాన్ ఉంచుకున్నారు. రూ.8 లక్షల కానుకలను రూపాయి కూడా ఖజానాకు జమ చేయకుండానే తీసుకొన్నారనే ఆరోపణలు వస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa