సీపీఎస్ రద్దు కోసం సీఎం జగన్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు సోమవారం యూటీఎఫ్ నాయకులు, టీచర్లు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. విజయవాడలో కఠిన ఆంక్షలు విధించారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్ వేశారు. సీఎం జగన్ పోలీసు వలయంలో ఎన్నాళ్లు దాక్కుని పాలన సాగిస్తారని ప్రశ్నించారు. అధికారంలోకొచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేకపోయారని నిలదీశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. "ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్ళు? శాంతియుతంగా నిరసన తెలపడమే నేరమంటూ యూటీఎఫ్ నేతలను, సిపిఎస్ ఉద్యోగుల సంఘం నాయకులను, ఉపాధ్యాయులను అక్రమంగా నిర్బంధించారు. మరి వారం రోజుల్లో సిపిఎస్ రద్దని మాట తప్పి మడమ తిప్పిన మిమ్మల్ని నిలదీయొద్దా జగన్ మోసపు రెడ్డి గారు?" అని ట్వీట్ చేశారు.
ఉపాధ్యాయుల పట్ల వైసిపి ప్రభుత్వ నిర్బంధకాండని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. కాకమ్మ కబుర్లతో మూడేళ్లు గడిపేశారని లోకేష్ విమర్శించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇదిలా ఉండగా సీఎంఓ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయవాడలో ఆంక్షలు విధించారు. అంతేకాకుండా గుంటూరు నుంచి తాడేపల్లి వెళ్లే ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఫలితంగా సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. పలు చోట్ల గుర్తింపు కార్డులు ఉంటేనే ప్రయాణికులను పోలీసులు అనుమతించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa