ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోమారు ఛార్జీల మోత తప్పదా..మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ఛార్జీలు

national |  Suryaa Desk  | Published : Tue, Apr 26, 2022, 09:43 PM

మొబైల్ ఫోన్ ఛార్జీల మోత మరోసారి సామాన్యుడిపై మోగనున్నది. మొబైల్ ఫోన్ వాడే వారికి మరోసారి బ్యాడ్ న్యూస్ అందబోతోందా? టెలికం కంపెనీలు ఇంకోసారి టారిఫ్ ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయా? నివేదికల ప్రకారం చూస్తే ఇదే జరగొచ్చని తెలుస్తోంది. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్‌పీయూ) పెంచుకోవడం కోసం టెలికం కంపెనీలు మరోసారి రీచార్జ్ టారిఫ్ ధరలను పెంచొచ్చని తెలుస్తోంది. టెల్కోలు చివరిగా 2021 డిసెంబర్ నెలలో టారిఫ్ ధరలను పెంచేశాయి. అప్పుడు 20 శాతం వరకు ధరలు పెంచేశాయి. దీంతో మొబైల్ ఫోన్ వాడే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఇప్పటికే ఈ ఎఫెక్ట్ కొనసాగుతోంది. ఇప్పుడు మరోసారి కంపెనీలు ధరలు పెంచితే.. దీని వల్ల ప్రజలపై మరింత భారం పడనుంది. ఒకటి కన్నా ఎక్కువ సిమ్ కార్డులు కలిగిన వారు ఇప్పుడు కేవలం ఒక సిమ్ కార్డునే రీచార్జ్ చేసుకుంటున్నారు. దీంతో మిగతా సిమ్ కార్డు ద్వారా కంపెనీలకు ఎలాంటి రాబడి ఉండటం లేదు. అందుకే ఇప్పుడు టారిఫ్ ధరలను మరోసారి పెంచే ఛాన్స్ ఉందని నివేదికలు చెబుతున్నాయి.


ఇన్‌యాక్టివ్ కస్టమర్లు తగ్గిపోవడం వల్ల కంపెనీల యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఉదాహరణకు రిలయన్స్ జియో యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఫిబ్రవరి చివరి నాటికి 94 శాతంగా ఉంది. ఇది గరిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు. టెలికం రంగానికి చెందిన నిపుణుల ప్రకారం భారతీ ఎయిర్‌టెల్ తన ఏఆర్‌పీయూను మరింత పెంచుకోవాలని భావిస్తోంది. జియో కూడా ఇదే మార్గంలో నడిచే ఛాన్స్ ఉంది. మరోసారి టారిఫ్ ధరలను పెంచినా కూడా ఔట్‌లుక్ బలముగానే ఉందని నిపుణులు చెబుతున్నారు.


ఎయిర్‌టెల్ కంపెనీ ఈ ఏడాది ఏఆర్‌పీయూను రూ.200కు చేర్చాలని లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. డిసెంబర్ చివరి నాటికి కంపెనీ ఏఆర్‌పీయూ రూ.163గా ఉందని తెలుస్తోంది. అలాగే వొడాఫోన్ ఐడియా కూడా ఏఆర్‌పీయూను పెంచుకోవాలని భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సంస్థ ఏఆర్‌పీయూ ఎలా ఉందో తెలియదు. కాగా టారిఫ్ దరల పెంపు వల్ల జియో, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు వరుసగా ప్రతి నెలా కస్టమర్లను కోల్పోతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఎయిర్‌టెల్ యూజర్లు మాత్రం పెరుగుతూ వస్తున్నారు. అయితే యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తోంది. అంటే రీచార్జ్ చేసుకునే కస్టమర్లు పెరుగుతున్నారు.


అయితే మరి కొంత మంది మాత్రం టారిఫ్ ధరల పెంపు వెంటనే ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇది వరకు రేట్ల పెంపు ప్రభావం ఇంకా కొనసాగుతోందని, కంపెనీలకు కూడా ఈ పెంపు ప్రయోజనాలు ఇంకా పూర్తి స్థాయిలో లభించలేదని వివరిస్తున్నారు. అందవల్ల స్పెక్ట్రమ్ వేలం తర్వాత ధరల పెంపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అప్పుడు సంస్థలు ప్రాఫిటబిలిటీ గురించి ఆలోచించొచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుత ఏఆర్‌పీయూతో టెల్కోలు 5జీ బిజినెస్ చేయడం కష్టమని నిపుణులు తెలియజేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa