గత రెండేళ్లుగా అదానీ గ్రూప్ కంపెనీలు అద్భుత ప్రదర్శన చేస్తున్నాయి. 2021లో అదానీ సంపద 49 బిలియన్ డాలర్లకుపైగా పెరిగింది. వారానికి రూ.6 వేల కోట్ల చొప్పున ఆయన సంపద పెరిగిందని హురున్ రిచ్ లిస్ట్ వెల్లడించింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ కంటే వేగంగా ఈ రెండేళ్ల కాలంలో అదానీ సంపదను పెంచుకున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ విలువ 2020 జనవరితో పోలిస్తే.. 1600 శాతం పెరగడం గమనార్హం. అదానీ టోటల్ గ్యాస్ షేర్ల విలువ సైతం 1200 శాతం పెరిగింది. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ల విలువ 1196 శాతం ఎగబాకింది.
2022లోనూ అదే ట్రెండ్ కనిపించింది. అదానీ పవర్ షేర్ల విలువ 160 శాతం పెరగ్గా.. అదానీ గ్రీన్ ఎనర్జీ విలువ 110 శాతం పెరిగింది. అదానీ గ్రూపులో లక్ష కోట్ల రూపాయల మార్క్ను చేరుకున్న ఆరో సంస్థగా అదానీ పవర్ సోమవారం రికార్డ్ క్రియేట్ చేసింది.
అదానీ గ్రూపు ఎనర్జీ మార్కెట్ విలువ రూ.4.41 లక్షల కోట్లు కాగా.. అదానీ ట్రాన్స్మిషన్ విలువ రూ.2.86 లక్షల కోట్లుగా ఉంది. అదానీ టోటల్ గ్యాస్ విలువ రూ.2.66 లక్షల కోట్లకు చేరగా.. అదానీ ఎంటర్ప్రైజెస్ విలువ రూ.2.51 లక్షల కోట్లకు, అదానీ పోర్ట్స్ విలువ రూ.1.81 లక్షల కోట్లకు చేరుకుంది. ఫిబ్రవరి 8న అదానీ గ్రూప్నకు చెందిన అదానీ విల్మర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ షేర్ విలువ 190 శాతం పెరిగింది. దీని మార్కెట్ విలువ కూడా లక్ష కోట్ల మార్క్కు చేరువలో ఉంది.
జనవరి 2020 నుంచి రిలయన్స్ ఇండస్ట్రీ షేర్ విలువ 70 శాతం పెరిగింది. అప్పటి నుంచి అంబానీ సంపద 4.95 బిలియన్ డాలర్లు పెరగ్గా.. ఇదే కాలంలో అదానీ నికర సంపద ఏకంగా 41.9 బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. 2050 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ మరో 25 ట్రిలియన్ డాలర్లు వృద్ధి చెందుతుందని అదానీ అంచనా వేస్తున్నారు. అప్పటికి మన దేశంలో పేదరికం ఏ రూపంలోనూ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa