ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సబ్‌వే స్టేషన్‌...ఉక్రెయిన్ వాసులకు నివాసమైంది

international |  Suryaa Desk  | Published : Tue, Apr 26, 2022, 09:51 PM

పంథం..పథం నీదా నాదా అన్నట్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్దానికి కారణమైంది. రష్యా యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఉక్రెయిన్‌వాసులు తలో దిక్కు అయిపోయారు. చాలామంది పొరుగుదేశాలకు పారిపోగా.. అక్కడే ఉండిపోయిన వారు తమ ఇళ్లు కోల్పోయి.. ఎక్కడ ఉండాలో తెలియక అల్లాడుతున్నారు. ఎవరికి ఎవరు మిగిలారో... తమ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో కూడా చాలామందికి తెలియదు. రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి వందలాది మంది ఖార్కివ్ నివాసితులు భూగర్భ రైల్వే స్టేషన్లలో ఆశ్రయం పొందుతున్నారు. అందులో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఉన్నారు.


రష్యా దాడుల్లో ఖార్కివ్‌లో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అక్కడున్న ఇళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు ధ్వంసమయ్యాయి. దాంతో నిర్వాసితులుగా మారిన వందలాదిమంది ప్రజలు ఖార్కివ్‌లోని సబ్‌వే స్టేషన్‌లో తలదాచుకుంటున్నారు. అందులో చాలామంది రెండు నెలలుగా అక్కడ నుంచి బయటకే రాలేదు. వాళ్లలో కొంతమంది ల్యాప్‌టాప్‌ల్లో పనిచేసుకోవడం, పడుకోవడం, చదువుకోవడంతో కాలం వెళ్లదీస్తున్నారు. వారందరికీ ఆహారం, నీళ్లు కూడా ఏర్పాటు చేశారు. వస్తువులు పెట్టుకోవడానికి అల్మారాలను కూడా ఏర్పాటు చేశారు. అక్కడున్నవారంతా సాధారణ జీవితాలను కోల్పోయారు. ఆ సబ్‌వే స్టేషన్‌లోని జీవితానికి అలవాటు పడ్డారు.


అలెక్స్‌ అనే ఓ 13 ఏళ్ల కుర్రాడు కూడా 70 రోజులుగా అక్కడే ఉంటున్నాడు. తన కుటుంబంతో కలిసి ఇక్కడకు వచ్చానని, సబ్‌వే నే ఇప్పుడు తనకు ఇల్లు, పాఠశాల, ఆటస్థలం కూడా అని చెప్పుకొచ్చాడు. "ఇది ఇప్పుడు నా ఇల్లు. రెండు నెలలుగా ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడే చదువుకుంటున్నాను. నేను భయపడను." అని చెప్పాడు. అలెక్స్ ఎక్కడ చదువుకుంటాడో, సమయాన్ని ఎలా గడుపుతున్నాడో అలెక్స్ తల్లీ ఐరీన్ చెప్పింది. రోజూ ఆన్‌లైన్ తరగతులకు అటెండ్ అవుతాడని చెప్పింది. కొన్ని వస్తువుల కోసం ఐదు రోజుల క్రితం ఇంటికెళ్లానని అది శిథిలావస్థలో ఉందని ఐరీన్ చెప్పింది.


ఇదిలావుంటే ఫిబ్రవని 24వ తేదీ నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలయ్యాయి. దాంతో ఉక్రెయిన్‌లోని 90 శాతం పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. మరీ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో.. వీరందరూ ఎప్పుడు మళ్లీ సాధారణ జీవితాల్లోకి వెళ్తారో.. ఎవరికీ తెలియడం లేదు. రష్యా బలగాలు ఉక్రెయిన్‌ నగరాలపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. యుద్ధం విషయంలో ఇరు దేశాలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa