ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంపదలో బిల్ గేట్ ను అదానీ వెనక్కి నెట్టేస్తారా

national |  Suryaa Desk  | Published : Tue, Apr 26, 2022, 09:50 PM

భారత కుబేరుల ఆదాయం పెంపుదలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ శర వేగంగా సంపద సృష్టిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముకేశ్ అంబానీని దాటేసి.. ఆసియాలోకెల్లా అత్యంత సంపన్నుడిగా అవతరించిన అదానీ తాజాగా మరో ఘనత సాధించారు. బెర్క్‌షైర్ హాత్‌వే సీఈవో వారెన్ బఫెట్‌ను దాటేయడం ద్వారా ప్రపంచ కుబేరుల జాబితాలో ఐదోస్థానానికి చేరుకున్నారు. ఫోర్బ్స్ ధనికుల జాబితా ప్రకారం.. 122.3 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ ఐదో స్థానానికి దూసుకెళ్లారు. వారెన్ బఫెట్ కంటే అదానీ ఆస్తుల విలువ 1 బిలియన్ డాలర్ల మేర ఎక్కువగా ఉంది.


ఏప్రిల్ 1న 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన ఆదానీ.. మరో 25 రోజులు గడిచే సరికే ప్రపంచంలోని టాప్-5 సంపన్నుల్లో ఒకడిగా నిలవడం గమనార్హం. ఈ 25 రోజుల్లోనే ఆయన సంపద 22.3 బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ 269.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 170.2 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా.... లూయిస్ వియుట్టన్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ 161.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 130.2 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ 101.8 బిలియన్ డాలర్లుగా ఉంది. అదానీ జోరు చూస్తుంటే.. మరి కొద్ది రోజుల్లోనే బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.


గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా అదానీ గ్రూప్ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోంది. ఓడ రేవులు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్, షిప్పింగ్, రైల్వేలు, వనరులు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, పునరుత్పాదక శక్తి వనరులు, గ్యాస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అగ్రో, రియల్ ఎస్టేట్, ప్రజా రవాణా, కన్జూమర్ ఫైనాన్స్, రక్షణ తదితర రంగాల ద్వారా అదానీ ఆర్జిస్తున్నారు. గుజరాతీ జైన కుటుంబంలో జన్మించిన అదానీ.. అనూహ్య రీతిలో ఎదిగారు. 1994లో గుజరాత్ ప్రభుత్వం ముంద్రా పోర్టును ప్రయివేట్ సంస్థలకు ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వాలని నిర్ణయించడం అదానీ పాలిట వరంలా మారింది. ఈ కాంట్రాక్టును దక్కించుకున్న అదానీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అదానీ గ్రూపు ఆధ్వర్యంలోని ముంద్రా పోర్టు దేశంలోని అతిపెద్ద ప్రయివేట్ ఓడరేవుగా అవతరించింది. ఏటా 210 మిలియన్ టన్నుల సరకు ఎగుమతులు, దిగుమతులు జరపగల సామర్థ్యం దీనికి ఉంది. దేశంలో ఎక్కువ పోర్టులను నిర్వహిస్తోన్న సంస్థగా అదానీ గ్రూపు అవతరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa