బాల్యవివాహాలు అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కనిగిరి ఆర్డీవో కె సందీప్ కుమార్ అన్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కనిగిరి పట్టణంలోని స్థానిక షాదీఖానాకమ్యూనిటీ హాల్ నందు కనిగిరి డివిజన్ స్థాయిలో బాల్య వివాహాల నిరోధక పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ డి ఓ సందీప్ కుమార్ మాట్లాడుతూ పిల్లలను బడికి మాన్పించి చిన్న వయస్సులోనే బాల్యవివాహాలు చేయడం వల్ల వారి జీవితాన్ని చిదిమివేసిన వాళ్లమవు తామన్నారు.
ఐ. సి. డి. ఎస్, పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో అధికారులు బాల్యవివాహాలు అరికట్టడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారన్నారు. ప్రజల నుంచి కూడా సహకారం లభిస్తే బాల్యవివాహాలు పూర్తిస్థాయిలో నిర్మూలించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బాల్యవివాహాలు అరికట్టడానికి గ్రామాల నుంచే వివాహ నమోదులు తప్పని సరిగా చేయాలని, దీనికి ప్రతి ఒక్కరు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
బాల్య వివాహము జరిగినట్టు నిర్ధారణ అయితే చట్టప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఒక లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ పెళ్లికి హాజరైన ప్రతి ఒక్కరిని బాధితులు చేస్తామని అవగాహన కలిగించారు. కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ బాల్య వివాహాలు జరుగుతున్నట్టు సమాచారం వస్తే, దానిని అరికట్ట డానికి ఒక్క అంగన్వాడీ టీచర్ కాకుండా సంబంధిత అధికారులు బృందంగా వెళ్తే బాగుంటుందని చెప్పారు.
బాల్యవివాహాల నిషేధం అనేది ఒక సామాజిక బాధ్యతగా అందరూ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ధనలక్ష్మి, కనిగిరి ఏఎంసీ చైర్మన్ సరితా రెడ్డి, కనిగిరి జడ్పిటిసి సభ్యులు మడతల కస్తూరి రెడ్డి, కనిగిరి సీఐ అప్పారావు, వైస్ చైర్మన్ పులి శాంతి, ఎంపీపీ దంతులూరి ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa