ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుఫాను బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 03:29 PM

తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లు, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ చేపట్టారు. సహాయక చర్యలపై సమీక్ష జరిపారు. ఇప్పటికే తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను జిల్లాలకు ప్రభుత్వం పంపిందన్నారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో హై అలర్ట్‌గా ఉండాలన్నారు. ఇప్పటికే జిల్లాలకు నిధులు ఇచ్చామని, తుపాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమని కలెక్టర్లు, అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమయిన ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.


ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అవసరమైన చోట సహాయపునరావాస శిబిరాలను తెరవాలన్నారు. సహాయ శిబిరాలకు తరలించిన ఒక వ్యక్తికి రూ. వెయ్యి, కుటుంబానికి రూ. 2వేల చొప్పున అందజేయాలన్నారు. సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయలన్నారు. జనరేటర్లు, జేసీబీలు ఇవన్నీకూడా సిద్ధంచేసుకోవాలన్నరు. కమ్యూనికేషన్‌ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. తుపాను బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. వారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాలన్నారు. పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దని చెప్పారు. సెంట్రల్‌ హెల్ప్‌ లైన్‌తో పాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు సమర్థవంతగా పనిచేసేలా చూడాలన్నారు. వచ్చే కాల్స్‌ పట్ల వెంటనే స్పందించాలన్నారు. ఈ నంబర్లకు బాగా ప్రచారం కల్పించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏలూరు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, అదనపు ఎస్పీ చక్రవర్తి, డిఆర్ వో పి. సత్యనారయణమూర్తి, వ్యవసాయ, ఉద్యాన, పంచాయతీ, ఆర్ అండ్ బి, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa