ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంకకు సైన్యం పంపడంలేదు: భారత్ హైకమిషన్ స్పష్టీకరణ

international |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 02:28 AM

శ్రీలంక దేశంలోని పరిస్థితులపై రోజుకోవార్త వెలుగులోకి వస్తోంది. తీవ్ర ఆర్ధిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు చేజారడంతో సహాయంగా భారత్ సైన్యాలను పంపనుందని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను భారత్ హైకమిషన్ కొట్టిపారేసింది. అయితే, పొరుగుదేశంలో ప్రజాస్వామ్యం, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు, ఆర్థిక పునరుద్ధరణకు పూర్తిగా మద్దతు ఉంటుందని ప్రకటించింది. అంతకు ముందు మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన కుటుంబ సభ్యులు భారత్‌కు పారిపోయారని స్థానిక సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని భారత్ మిషన్ మంగళవారం ఖండించిన విషయం తెలిసిందే.


తాజాగా, సైన్యాలను భారత్ పంపుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది. రాజీనామా అనంతరం మహింద రాజపక్స తన అధికారిక నివాసం వదిలివెళ్లడంతో ఆయన భారత్‌కు పారిపోయారని విస్తృతంగా ప్రచారం జరిగింది. రాజపక్స కుటుంబానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో లంక అట్టుడుకుతోంది. నిరసనకారులపై ఉక్కుపాదం మోపడానికి లంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యం, పోలీసులకు విశేష అధికారాలను కట్టబెట్టంది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను వెలువరించింది.


అయితే, శ్రీలంకకు భారత్ సైన్యాన్ని పంపుతోందనే వార్తలపై భారత హైకమిషన్ స్పందించింది.‘‘లంకకు భారత్ సైన్యాలను పంపడం గురించి మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న ఊహాజనిత నివేదికలను హైకమిషన్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోంది.. భారత ప్రభుత్వ విధానానికి ఇవి వ్యతిరేకం.. శ్రీలంకలో ప్రజాస్వామ్యం, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు, ఆర్థిక పునరుద్ధరణకు భారత్ పూర్తిగా మద్దతు ఇస్తుందని నిన్నే విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు’’ అని ట్వీట్ చేసింది.


మరోవైపు, శ్రీలంక ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ మంగళవారం స్పందించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా శ్రీలంక ప్రజల ఉత్తమ ప్రయోజనాల కోసం భారత్ ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు. ‘సన్నిహిత, చారిత్రక సంబంధాలు కలిగిన పొరుగుదేశంగా శ్రీలంకకు భారత్‌ పూర్తి మద్దతు ఇస్తుంది.. ప్రజాస్వామ్యం, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు, ఆర్థిక పునరుద్ధరణకు అండగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు.


‘మా పొరుగు దేశం మొదటి విధానానికి అనుగుణంగా ఈ ఒక్క ఏడాదిలోనే 3.5 బిలియన్ల డాలర్ల సహాయాన్ని అందించాం... ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను అధిగమించేందుకు ఈ మొత్తాన్ని వెచ్చింది. అత్యవసర సామాగ్రి కొరతను తగ్గించేందుకు ఆహారం, ఔషధాలను అందజేశాం’ అని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa