తెలుగు రాష్ట్రాల్లో మాంసం ప్రియులకు చికెన్ ధరలు షాకిస్తున్నాయి. ఇప్పటికే మటన్ రేట్లు మండిపోతుండగా, మరోవైపు చికెన్ ధరలు కూడా ఆకాశాన్నంటాయి. దీంతో అటు మటన్.. ఇటు చికెన్.. కొనలేని పరిస్థితి ఏర్పడింది. మాంసం ధరలు అమాంతం పెరిగిపోవడంతో.. మాంసాహార ప్రియుల నోటికి తాళం వేసినట్లు అయింది.
రెండు రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర రూ.300 మార్క్ని చేరింది. విశాఖపట్నంలో కిలో చికెన్ ధర ఏకంగా రూ.312కి చేరి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. దీంతో చికెన్ కొనేందుకు సామాన్యులు వెనుకాడుతున్నారు. ఈ నెల 1న రూ.228గా ఉన్న కిలో చికెన్ ధర.. కేవలం 11 రోజుల్లోనే రూ.84 మేర పెరగడం గమనార్హం.
ఈ ఏడాది ప్రారంభంలో కిలో చికెన్ ధర రూ.214 ఉండగా.. మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.280కి చేరింది. ఆ తర్వాత మళ్లీ క్రమంగా తగ్గుతూ మే 1 నాటికి రూ.228కి చేరింది. గతంలో కోవిడ్ సెకండ్ వేవ్ సందర్భంగా చికెన్ ధరలు అమాంతం దిగొచ్చిన సంగతి తెలిసిందే. కిలో చికెన్ రూ.80 కన్నా తక్కువకే లభించింది. సెకండ్ వేవ్ తర్వాత చికెన్ ధరలు మళ్లీ పెరుగుతూ వచ్చాయి.
ప్రస్తుత వేసవి సీజన్లో డిమాండ్కు తగినంత సప్లై లేకపోవడంతోనే చికెన్ ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా వేసవిలో కోళ్లు తగినంత బరువు పెరిగేందుకు ఎక్కువ రోజులు పడుతుందని... అందుకే సప్లై తగ్గిపోయిందని అంటున్నారు. కోళ్లకు దానాగా వేసే తవుడు, మొక్కజొన్న, సోయ ధరలు పెరగడం కూడా చికెన్ ధరల పెరుగుదలకు కారణమంటున్నారు.
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. పాల దగ్గరి నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ వరకు అన్ని ధరలు పెరిగాయి. తాజాగా చికెన్ ధరలు కూడా కొండెక్కడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు మాంసానికి దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ధరల పెరుగుదలపై సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa