ఎన్టీఆర్ బతికే ఉంటే చంద్రబాబు పరిస్థితి ఎంటో అందరికీ తెలుసని మంత్రి ఆర్.కె.రోజా అన్నారు. అలాగే, జూనియర్ ఎన్టీఆర్కు భయపడి పార్టీ నుంచి ఆయన్ను తరిమేసారని ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టిన శని అని గతంలోనే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అన్నారని రోజా తెలిపారు. ఎన్టీఆర్ ప్రాణాలు తీసేసి నేడు ఆయన ఫోటోకి దండలు వేసి, దండం పెడుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకి పెడితే చంద్రబాబు కనీసం కృతజ్ఞత కూడా ప్రదర్శించలేదని దుయ్యబట్టారు.
నగరి నియోజకవర్గ నేతలతో కలిసి మంత్రి రోజా శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అలాగే, గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో 99 శాతం మంది ప్రజలు ప్రేమతో ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.1.35 లక్షల కోట్లు జమ చేశారని మంత్రి రోజా తెలిపారు.
ఇక, తెలుగు దేశం పార్టీ వార్షిక వేడుక ‘మహానాడు’పై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ను, తమను తిట్టడానికే మహనాడు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. తాము చేసిన తప్పులను మహానాడులో సరిదిద్దుకోకుండా.. సీఎం జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని దుయ్యబట్టారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెడితే దళిత మంత్రి, బీసీ ఎమ్మేల్యే ఇళ్లను టీడీపీ, జనసేన నాయకులు కాల్చివేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడిని అమానుష చర్యగా అభివర్ణించిన మంత్రి రోజా.. అల్లర్లను అణచివేయడానికి పోలీసులు ఎంతో సమన్వయంగా వ్యవహరించారని కొనియాడారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లు ఎంతటి వాళ్లయినా వదిలేదేలేదని తేల్చిచెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa