నవరత్నాలతోపాటు రైతుల కోసం కొత్తగా వైసీపీ ప్రభుత్వం రైతు రథం పథకం తీసుకొస్తోంది. అన్నదాతల కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తోన్న జగన్ సర్కారు తాజాగా ఈ నూతన పథకానికి శ్రీకారం చుట్టింది.‘రైతు రథం’ పేరిట రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. జూన్ ఆరో తేదీన ఈ పథకం ప్రారంభం కానుంది. అదే రోజున రైతులకు 6 వేల ట్రాక్టర్లను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కింద ట్రాక్టర్ పొందడం కోసం చిన్న, సన్నకారు రైతులు ఓ గ్రూపుగా ఏర్పడాల్సి ఉంటుంది. కనీసం ముగ్గురు రైతులు ఓ గ్రూపుగా ఏర్పడి.. దానికి పేరు పెట్టాలి.
ప్రతి రైతు తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ జిరాక్స్ కాపీలతో పాటు.. బ్యాంక్ నుంచి బకాయిలేవీ లేవని నిర్ధారించే నో డ్యూ సర్టిఫికెట్ను రైతు భరోసా కేంద్రంలో అందించాలి. ఇలా చేశాక.. గ్రూప్ పేరుమీద బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేయాలి. జూన్ రెండో తేదీ లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసిన రైతులు సబ్సిడీ ట్రాక్టర్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రైతులు తమకు నచ్చిన ట్రాక్టర్ను ఎంపిక చేసుకోవచ్చు. ట్రాక్టర్కు సంబంధించిన వివరాలను సైతం రైతు భరోసా కేంద్రానికి సమర్పించాలి.
రైతు రథం కింద ఎంపికైన రైతు గ్రూపు ఖాతాకు ట్రాక్టర్ సబ్సిడీ మొత్తాన్ని బదిలీ చేస్తారు. మిగతా మొత్తం చెల్లించి రైతులు ట్రాక్టర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా గ్రూపులుగా ఏర్పడిన రైతులకు ట్రాక్టర్లు మాత్రమే కాకుండా ఇతర వ్యవసాయ పనిముట్లను సైతం ప్రభుత్వం అందిస్తుంది. పురుగు మందులు పిచికారీ చేయడం కోసం డ్రోన్లను సైతం రైతులకు అందించనుంది.
వాస్తవానికి చంద్రబాబు నాయుడు హయాంలోనే ‘రైతు రథం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 20 వేల ట్రాక్టర్లను అందించాలని లక్ష్యంగా భావించిన టీడీపీ సర్కారు.. 2018లో 6 వేల ట్రాక్టర్లను పంపిణీ చేసింది. కానీ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకే ట్రాక్టర్లు ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ‘వైఎస్ఆర్ రైతు రథం’గా మార్చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa