ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కెచ్ బెడసి కొట్టింది...అది ఇంటి దొంగల పనే

Crime |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 03:28 AM

ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడని అంటారు. కానీ బ్యాంకు దోపిడి కేసులో మాత్రం ఇంటి దొంగలను పోలీసులు పట్టుకొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సంచలనం సృష్టించిన ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఫిన్‌కేర్‌ లో చోరీ కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయితో పాటు సహకరించిన ఏడుగుర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. వీరి నుంచి రూ. కోటి విలువ చేసే 1274 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే ఇతర బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన ఒక కేజీ బంగారు ఆభరణాలు, రూ.3 లక్షల యాభై వేల రూపాయల డబ్బులు కూడా ఉన్నాయి. 840 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలు గుర్తించారు.


ఈ కేసులో అరెస్టైన వారిలో ప్రధాన ముద్దాయి ఫిన్ కేర్ బ్యాంకు మేనేజర్, అప్రైజర్ స్రవంతితో పాటు బ్యాంకు దోపీడికి సహకరించిన శ్రీకాళహస్తికి చెందిన నవీన్, సుల్తాన్ మహమ్మద్, విజయ్ కుమార్, చెన్నైకు చెందిన మహమ్మద్ హుస్సేన్, జగదీష్ కుమార్, ఆంటోనీ రాజ్, అరుణ్‌లు ఉన్నారు. స్రవంతి సొంత ఊరు తూర్పు గోదావరి జిల్లాలోని కొడమంచిలి ఆమె శ్రీకాళహస్తిలో నివాసముంటూ ఫిన్ కేర్ బ్యాంకులో పని చేస్తున్నారు. ఆర్థికంగా స్థిరపడాలని ఈ దోపిడీకి పాల్పడినట్లు బ్యాంక్ మేనేజర్ స్రవంతి ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.


శ్రీకాళహస్తిలోని పెద్దమసీదు వీధిలో ఫిన్‌కేర్ ఫైనాన్స్ సంస్థలో గత గురువారం ఈ చోరీ జరిగింది. అక్కడ పనిచేసే సిబ్బంది రాత్రి ఇళ్లకు వెళ్లిపోయాక.. మేనేజర్ స్రవంతి మాత్రం రాత్రి 10.30 సమయం వరకు అక్కడే ఉన్నారు. ఆఫీసుకు సంబంధించి పెండిగ్ వర్క్ ఉంటే చేసుకుంటున్నట్లు చెప్పారు. ఇంతలో ముగ్గురు దుండగులు కంపెనీ లోపలికి వచ్చారని చెప్పుకొచ్చారు. ఆ దుండుగులు తనను బెదిరించి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు, చేతులు కట్టేసి బంగారం, రూ.5 లక్షల డబ్బును ఎత్తుకెళ్లారన్నారు.


స్రవంతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరకుని పరిశీలించారు. అప్పుడే స్రవంతి తీరుపై అనుమానం వచ్చి ఆ కోణంలో దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడింది. ఈ చోరీ వెనుక స్రవంతి హస్తం ఉన్నట్లు తేలింది. స్రవంతి పనిచేస్తున్న సంస్థనే బురిడీ కొట్టించాలని చూసి.. బ్యాంకు లో దొంగలు పడి దోచుకెళ్లారని నమ్మించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa