విజనరీ సీఎం చంద్రబాబు, ప్రిజనరీ సీఎం జగన్కు ఇప్పుడు తేడా తెలుస్తోందని దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. ఈ ఫలితాల కారణంగా కొంత మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేసిందని ఆయన దుయ్యబట్టారు.
ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 5 వేలకు పైగా పాఠశాలలు మూతపడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతతో బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు విద్యకు దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 20 వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నా.. భర్తీ చేయడం లేదని విమర్శించారు.
ఆంగ్ల భాషలో బోధన అంటూ.. మాతృభాషలో బోధనను నిర్లక్ష్యం చేస్తున్నారని ధూళిపాళ్ల ఆరోపించారు. ఆంగ్లభాష బోధన వల్ల చిన్నారుల మానసిక వికాసం దెబ్బతింటోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకునే ‘నాడు- నేడు’ కార్యక్రమం పైన పటారం.. లోన లొటారమని ఎద్దేవా చేశారు. పదో తరగతి ఫలితాల్లో గత రెండు దశాబ్దాల కాలంలో ఇంతటి వైఫల్యం లేదని దుయ్యబట్టారు. దీనికి విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించకుండా.. విద్యార్థుల తల్లిదండ్రులపై నెట్టడం తప్పన్నారు.
కోవిడ్ వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించి ఇతర రాష్ట్రాలు విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించాయని ధూళిపాళ్ల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద ఉంచిందని ఆరోపించారు. అలాగే, విద్యార్థులను ఇంగ్లిష్ మీడియంలో చేరాలని బలవంతపెట్టడం దారుణమన్నారు. రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగా భావించాల్సి ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa