న్యాయం చేయాలని సహజంగా పోలీసులవద్దకు ప్రజలు వెళ్తుంటారు. అలాంటి ఖాకీయే తమకు న్యాయం చేయాలని కోరడం మొదలెట్టాడు. ఏపీ పోలీస్ను కాపాడాలంటూ ఏఆర్ కానిస్టేబుల్ ఒకరు ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు. పోలీసులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలంటూ అనంతపురం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రకాష్ నిన్న జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డు చేబూని నిరసన తెలిపారు. ‘‘ఏపీ సీఎం జగన్ సర్.. సేవ్ ఏపీ పోలీస్. గ్రాంట్ ఎస్ఎల్ఎస్, ఏఎస్ఎల్ఎస్ ఎరియర్స్.. సామాజిక న్యాయం ప్లీజ్’’ అంటూ ప్లకార్డు ప్రదర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమకు మూడు సరెండర్ లీవ్స్, అదనపు సరెండర్ లీవ్స్కు సంబంధించిన మొత్తం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, 14 నెలల రవాణా భత్యం, ఆరు డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. అంతేకాదు, ఈ బకాయిలు చెల్లించినట్టు ప్రభుత్వం ఆడిట్లో చూపించి పన్ను కూడా వసూలు చేసిందని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa