ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైసెక్యూరిటీ ప్లేట్లు లేకపోతే భారీ చలాన్లు: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 02:01 PM

గత 2014 నుంచి ఏపీలో కొత్త వాహనాలకు రవాణాశాఖ హైసెక్యూరిటీ ప్లేట్లు బిగిస్తోంది. రాష్ట్రంలో 1.5 కోట్ల వాహనాలు ఉండగా అందులో సగం వాహనాలకు మాత్రమే హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉన్నాయట. అంటే 75 లక్షల వాహనాలకు ఇంకా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించాల్సి ఉందని చెబుతున్నారు. అన్ని వాహనాలకు తప్పనిసరిగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉండాలని.. లేని పక్షంలో వాహనాలకు రూ.వెయ్యి జరిమానా విధించాలని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారట.


ఈ క్రమంలో వాహనాల హై సెక్యూరిటీ ప్లేట్లకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇకపై అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి చేసింది. పాత వాహనాలకు కూడా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల బిగించడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నంబర్ ప్లేట్ల ద్వారా అదనంగా రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని చెబుుతున్నారు.


ఇలా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌లు బిగిస్తే.. వాహన ప్రమాదాలను అరికట్టవచ్చు అంటున్నారు. అలాగే చోరీలు, దోపిడీలు, కిడ్నాప్‌లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. కొంతమంది నేరాల చేసేందుకు వాహనాల నంబర్ ప్లేట్లను మార్చేస్తున్నారని.. మరికొన్ని సందర్భాల్లో వాటిని గుర్తించకుండా కాల్చేసి సాక్ష్యాలు దొరక్కుండా చేస్తున్నారనేది భావన. ఇలాంటి నేరాలకు అన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకు రవాణాశాఖ హైసెక్యూరిటీ నంబర్ విధానాన్ని అమలులోకి తెచ్చింది.


రాబోయే రోజుల్లో ఈ నిర్ణయాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలోనే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు వాహనాలకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. ఇప్పుడు మళ్లీ హై సెక్యూరిటీ ప్లేట్లను వాహనాలకు తప్పనిసరి చేశారు. వాహనదారులు అప్రమత్తమై.. వెంటనే ప్లేట్లను బిగించుకోవాలని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa