ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగని హింసాత్మక ఘటనలు...అగ్నిపథ్ పై కొనసాగుతున్న నిరసనలు

national |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 09:33 PM

అగ్నిపథ్ పథకం వచ్చిన నాటి నుంచి దేశంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. పథకం విషయంలో ముందుకే అని కేంద్రం సాగుతుండగా...తాము కూడా తగ్గేది లేదని నిరసనకారులు ఆందోళనలను విస్త్రుతం చేస్తున్నారు. ఆర్మీ నియామకాలపై కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై వ్యతిరేక నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే తీవ్రస్థాయిలో శనివారం కూడా బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో యువత ఆందోళన చేశారు. యూపీలో యువకులు భారీ నిరసన చేయగా.. పంజాబ్ రైల్వే స్టేషన్‌లో పట్టాలపై నిరసన తెలిపారు. బీహార్‌లో కూడా యువత ఉద్రిక్తగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన బంద్ విజయవంతంగా సాగింది. పలు చోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాళ్లతో దాడి చేశారు.


బంద్‌ కారణంగా దుకాణాలు మూసివేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆందోళనకారులు షాపులపై రాళ్లు రువ్వారు. పాట్నా జిల్లాలోని మసౌర్హి సబ్-డివిజన్‌లోని తారేగానా రైల్వే స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఈ అల్లర్లలో ఓ పోలీస్ వాహనానికి నిప్పు పెట్టారు. అక్కడ పరిస్థితి అదుపు తప్పడంతో జీఆర్పీ సిబ్బంది కాల్పులు కూడా జరిపారు. ఒక ప్రాంతంలో ఆందోళనకారులు లారీని కూడా తగలబెట్టారు.


ఇలాంటి పరిస్థితుల వల్ల రైల్వే శాఖ 32 రైళ్లను రద్దు చేసింది. ఈ నెల20వ తేదీ ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఎలాంటి రైళ్లు నడవబోవని, రాత్రి 8 గంటల తర్వాత ప్రారంభమై... ఉదయం 4 గంటల వరకు కొనసాగుతాయని రైల్వే అధికారులు తెలిపారు. ఇక బీహార్‌లో ఇప్పటివరకూ 60కి పైగా రైలు బోగీలు, 10 ఇంజన్లు ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు.


ఉత్తరప్రదేశ్‌లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. జన్‌పుర్‌లో నిరసనకారులు ఓ బస్సును తగలబెట్టారు. రహదారులపై ద్విచక్ర వాహనాలు వేసి దగ్ధం చేశారు. ఇక పంజాబ్‌లోని లుథియానా రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. రైల్వే స్టేషన్ అద్దాలు, టికెట్ కౌంటర్లను పగలగొట్టారు. పట్టాలపై రైల్వే సామాగ్రి వేసి రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్పించారు.


అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కేరళ, కర్ణాటకలలో కూడా ఆందోళనలు జరిగాయి. త్రివేండ్రంలో వేలాదిమంది యువకులు ఆందోళనకు దిగారు. గతంలో లాగానే ఆర్మీ నియామాకాలు చేపట్టాలని వారంతా డిమాండ్ చేశారు. కొత్త పథకాన్ని రద్దు చేసే వరకు తమ ఆందోళన విరమించేది లేదని నిరసనకారులు అన్నారు. కర్ణాటకలోని ధార్వాడ జిల్లాలోని నైఖా సర్కిల్‌ దగ్గర యువకులు అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకం నినాదాలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa