ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రికవరీ ఏజెంట్లూ ఇక అలా చేయడం చెల్లదు: ఆర్బీఐ స్పష్టీకరణ

national |  Suryaa Desk  | Published : Sun, Jun 19, 2022, 06:08 PM

వివిధ బ్యాంకుల రుణాలను వసూలు చేస్తున్న రికవరీ ఏజెంట్లుకు ఆర్భీఐ గట్టి వార్నింగ్ ఇచ్చింది. నిబంధనలు అతిక్రమిస్తే ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని స్పష్టంచేసింది. బ్యాంకుల నుంచి, ఇతర ఆర్థిక రుణ సంస్థల నుంచి ప్రజలు రుణాలు తీసుకున్న తర్వాత, తిరిగి ఆ రుణాలు వసూలు చేసే క్రమంలో కొన్నిసార్లు రికవరీ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశంలోని రికవరీ ఏజెంట్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఫోన్ కాల్స్ చేసి వేధించడం, తప్పుడు మాటలు మాట్లాడడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రికవరీ ఏజెంట్లకు హితవు పలికారు. 


వేళకాని వేళల్లో, కొన్నిసార్లు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రివకరీ ఏజెంట్లు ఫోన్ చేయడంపైనా, అభ్యంతరకర భాష మాట్లాడడంపైనా తమకు ఫిర్యాదులు అందాయని అన్నారు. ఇలాంటి చర్యలతో ఆయా ఆర్థిక సంస్థలు తమ మనుగడకు తామే ముప్పు కొనితెచ్చుకున్నట్టు అవుతుందని స్పష్టం చేశారు. రికవరీ ఏజెంట్ల ఆగడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు.


ఫిర్యాదులు ఎదుర్కొనే ఆయా ఆర్థిక సంస్థలను సంబంధిత న్యాయ ప్రాధికార సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి విచారణ చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. రికవరీ ఏజెంట్లపై తమకు అందే ఫిర్యాదులను న్యాయ ప్రాధికార సంస్థలకు బదలాయిస్తామని తెలిపారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు ఇలాంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని, కాబట్టి ఈ తరహా విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుతున్నామని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa