ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిట్కో ఇళ్లను నిర్ణీత సమయంలోపు పూర్తిచేయండి: సీఎం వై.ఎస్.జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 01:58 AM

త్వరగా టిట్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికార్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. నిర్దేశించుకున్న సమయంలోగా పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. ఆలోగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలన్నారు.


కృష్ణా, గోదావరి నదులు మురుగు వల్ల కలుషితం కాకుండా పటిష్ట నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మురుగు నీటి శుద్ధికోసం తీసుకున్న, తీసుకోవాల్సిన చర్యలు, విజయవాడలో కాలువల సుందరీకరణపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే విజయవాడ, విశాఖపట్నంలో విమానాశ్రయాలకు వెళ్లే రహదారులను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు.


పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సోమవారం సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. పురపాలక శాఖలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సీఎం చర్చించారు. అలాగే నగరపాలక, పురపాలక సంస్థల్లో రోడ్ల అభివృద్ధిపైనా సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. రోడ్లపై గుంతలు పూడ్చే పనులు ముమ్మరంగా చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే 51.92 శాతం పనులు పూర్తయ్యాయని, జూలై 15 నాటికి రోడ్లపై గుంతలు లేకుండా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. మురుగు జలాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. మురుగును శుద్ధి చేసిన తర్వాతే అవి కాల్వల్లోకి, నదుల్లోకి చేరాలన్నారు. ఈ ప్రాజెక్టుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.


ఇక జగనన్న హరిత నగరాలు, స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌పై కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎంపిక చేసిన రోడ్లను అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం జగన్ సూచించారు. ప్రతి నియోజకవర్గంలో స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ ప్రారంభం కావాలన్నారు. నగరాలు, పట్టణాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లను, ఆర్వోబీలను సత్వరమే పూర్తి చేయాలని.. అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.


వచ్చే నెల జులైలో కొత్తగా మహిళా మార్టులను ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ఇప్పటికే 6 చోట్ల నడుపుతున్నామని.. పైలెట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన మార్టులు ఎలా నడుస్తున్నాయో సమీక్ష చేయాలని సూచించారు. అవి సమర్థంగా నడిచేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa