పులిని చూస్తేనే వణుకుపుడుతుంది. అలాంటిది పెద్ద పులినే ఎదుర్కోవాల్సి వస్తే మామూలు విషయం కాదు. కాకినాడ జిల్లా ప్రజలను పెద్దపులి మళ్లీ వణికిస్తోంది. రౌతులపూడి మండలంలోని ఎస్.పైడిపాల శివారు గ్రామమైన పెనుగొండలో బుధవారం ఆవులపై పులి దాడి చేసింది. ఎస్.పైడిపాలకు చెందిన రైతు ఈగల వరహాలుకు చెందిన పశువులు పెనుగొండలో బిళ్లలొద్ది, తోటమానిలొద్దిలో మేతకు వెళ్లగా పులి వాటిపై దాడిచేసింది. వీటిలో ఓ పశువు గాయాలతో వెనుదిరగగా.. మరొకటి కనిపించడం లేదు. దీంతో రైతులు ఆవు కోసం గాలింపు చేపట్టగా పులి సంచరించే అవకాశముందని ఫారెస్ట్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. సుమారు 20 రోజుల పాటు ఈ ప్రాంత వాసులను వణికించి పులి జాడ కొద్దిరోజులుగా కనిపించకపోవడంతో అడవిలోకి వెళ్లిపోయి ఉండొచ్చని భావించారు. అయితే పులి తాజాగా పశువులపై దాడి చేయడంతో ప్రజలు మళ్లీ ఉలిక్కిపడ్డారు.
పెద్దపులి పయనం అడవి వైపుగా ఉందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. శంఖవరం మండలం శృంగధార వద్ద సోమవారం లేగదూడను వేటాడాక అడుగుజాడలు లభ్యం కాలేదు. బిళ్లలొద్ది, తోటమాని లొద్దులో ఆవులపై దాడి విఫలయత్నంతో దాని గమనం అటవీ యంత్రాంగానికి తెలిసింది. పచ్చిక మేస్తున్న ఆవులపై పులి పంజా విసరగా అవి గాయపడి తప్పించుకున్నాయి. ఇది పులి దాడేనని అటవీ అధికారులు ధ్రువీకరించారు. పైడిపాల నుంచి అనకాపల్లి జిల్లాలోని సరుగుడు, నర్సీపట్నం వైపుగా సాగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్దిపాలెం సమీప పొట్టిమెట్ట నుంచి కిత్తమూరిపేట, చంద్రబాబు సాగర్ సమీప లొద్దిపాలెం మీదుగా ఉపప్రణాళిక ప్రాంతంలో నాలుగు రోజులుగా సంచరిస్తోందని గుర్తించారు. తాడువాయి, శృంగధార, పైడిపాల మీదుగా పులి వచ్చిన దారినే వెనుదిరుగుతోందని, ఆహారం కోసం దారిలో కనిపించిన పశువులను వేటాడుతోందని ఎఫ్ఆర్వో శ్రీనివాస్ తెలిపారు. పులి అడవి బాటన వెనక్కి వెళ్లేలా సమీప గ్రామాల్లో పహారా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa