తిరుపతి జిల్లాలో అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10వేల మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అపాచీ పరిశ్రమలో ఆడిడాస్ షూలు, లెదర్ జాకెట్స్, బెల్ట్లు వంటి ఉత్పత్తులు తయారవుతాయి. మొదటి దశలో రూ. 350 కోట్లు, వచ్చే ఐదేళ్లలో మరో 350 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. అపాచీ పరిశ్రమ ద్వారా మొత్తం 15 వేల మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. దాదాపుగా రూ.800 కోట్లతో నిర్మాణాలు మొదలవుతాయి. నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ అపాచీ గ్రూప్ కంపెనీ ఏర్పాటు చేశారు. అక్కడ 15 వేల మంది పని చేస్తున్నారు. అందులో 60 శాతం మంది నా చెల్లెమ్మలే పని చేస్తున్నారు. గొప్ప పెసిలిటీ అక్కడ తయారైంది. ఈ మధ్య కాలంలోనే పులివెందులలో మరో 2 వేల మంది చెల్లెమ్మలకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి ఈ మధ్యలోనే శంకుస్థాపన చేశాం. మార్చికల్లా పనులు పూర్తి చేసి ఆ ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వస్తుంది. ప్రపంచంలో అత్యుత్తమ కంపెనీ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. 2023 సెప్టెంబర్ కల్లా పరిశ్రమ అందుబాటులో వస్తుంది. 80 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు రానున్నాయని ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలిపారు. ఈ ప్యాక్టరీకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని, ఒక్క ఫోన్ కాల్తో మీ సమస్యకు పరిష్కారం చూపుతామని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కంపెనీ ప్రతినిధులకు భరోసా కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa