ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ ఇంధనం పొదుపుగానే...శ్రీలంకలో కీలక నిర్ణయం

international |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 02:08 PM

దేశంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పెట్రోల్ అమ్మకాలపై పరిమితి విధించింది. ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. టోకెన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ పరిమితికి మించి పెట్రోల్ కొనుగోలు చేసే అవకాశం వాహనదారులకు ఉండబోదని తేల్చి చెప్పింది. ఈ ఆంక్షల నుంచి డీజిల్‌ అమ్మకాలకు మినహాయింపు ఇచ్చింది. పొదుపుగా వినియోంచుకోవడానికి పెట్రోల్ రేషనలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది.


ఇదిలావుంటే శ్రీలంక సంక్షోభానికి తెరపడట్లేదు. రోజులు గడుస్తున్నా ఏ మాత్రం కోలుకోవట్లేదు. ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ.. పరిస్థితుల్లో మార్పు ఉండట్లేదు. ప్రధానంగా ఇంధన కొరత శ్రీలంకను వెంటాడుతూనే వస్తోంది. డిమాండ్ మేరకు ఇంధనాన్ని కొనుగోలు చేసేంత ఆర్థిక స్థోమత శ్రీలంకకు లేదు. భారత్ సహా కొన్ని దేశాలు ఆర్థికంగా తమవంతు సహకారాన్ని అందిస్తోండటంతో ఆ మాత్రం ఇంధనమైనా లభిస్తోందక్కడ. ఈ నేపథ్యంలో పై విధంగా నిర్ణయం తీసుకొన్నారు.


దీని ప్రకారం- ద్విచక్ర వాహనదారులు ఇకపై నెలలో 1,500 రూపాయల వరకు మాత్రమే పెట్రోల్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి మించి ఎక్కువ పెట్రోల్ కొనుగోలు చేయడానికి వీలు లేదు. ఆటో వంటి త్రీ వీలర్ వాహనదారులు నెలలో 2,500 రూపాయల వరకు పెట్రోల్ కొనుగోలు చేయవచ్చు. ఇతర వాహనాలకు 7,000 రూపాయల వరకు పరిమితి విధించింది. కార్లకు విధించిన పరిమితి మొత్తం 7,000 రూపాయలు. ఆయా వాహనదారులు నెలలో 7,000 రూపాయల వరకు మాత్రమే పెట్రోల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


ఇదిలావుంటే శ్రీ‌లంక‌లో ఇటీవలే పెట్రోల్ ధ‌ర‌లు మ‌రింత పెరిగిన విషయం తెలిసిందే. పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 470 రూపాయలు పలుకుతోంది. డీజిల్ లీటర్ ధ‌ర 460 రూపాయలు. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను నెల రోజుల్లో మూడోసారి పెంచింది శ్రీలంక ప్రభుత్వం. అయినప్పటికీ.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించాల్సిన మొత్తాల బకాయిలు పేరుకుని పోతూనే వస్తోన్నాయి. దీనివల్లే శ్రీలంకకు క్రూడాయిల్‌ను పెద్ద మొత్తంలో సరఫరా చేయడానికి చమురు ఉత్పాదక దేశాలు ఆసక్తి చూపట్లేదని చెబుతున్నారు.


ఇంధన కొరతను నివారించడానికి ఒకవంక ప్రయత్నాలు సాగిస్తూనే.. అందుబాటులో ఉన్న దాన్ని పొదుపుగా వాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోంది శ్రీలంక ప్రభుత్వం. కొరతను నివారించడంలో భాగంగా శ్రీలంక పెట్రోలియం శాఖ మంత్రి ఖతర్‌కు బయలుదేరి వెళ్లారు. క్రూడాయిల్ సరఫరాపై ఆ దేశ ప్రభుత్వంతో సంప్రదింపులు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి మళ్లీ రష్యాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ రెండు దేశాలతో క్రూడాయిల్ సరఫరాపై ఒప్పందాన్ని కుదుర్చుకుంటారని ప్రభుత్వం తెలిపింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa