వచ్చే ఎన్నికలు ఈ సారి హోరాహోరి తప్పదన్న కథనాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ ఈ సారి కాస్త పుంజుకొంటోంది. మరోవైపు బీజేపీ, టీడీపీకి షరత్తులు పెట్టిన జనసేన సొంతంగా అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్న వైసీపీ నాయకత్వం ఆ ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ నయా ట్రెండ్ పాటిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థులను ఒక్కొక్కరిగా ప్రకటిస్తూ వస్తోంది. పార్టీకి ప్రాంతీయ సమన్వయకర్తలుగా నియమితులైనవారు నియోజకవర్గాల ప్లీనరీల్లో పాల్గొంటూ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారు. దీంతో ఆయా సీట్లపై ఆశలు పెట్టుకున్నవారు నిరాశకు గురవుతున్నారు. పార్టీలో గ్రూపులను నియంత్రించడానికి ముందుగానే పేర్లు ప్రకటించడంవల్ల ప్రయోజనం ఉంటుందని పార్టీ అధిష్టానం ఆలోచనగా ఉంది.
సర్వే నివేదిక ఆధారంగానే అభ్యర్థులను ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ''గడప గడపకు మన ప్రభుత్వం'' కార్యక్రమంలో భాగంగా చేస్తున్న సర్వే ఆధారంగా ఈ ఏడాది అక్టోబరునాటికి అభ్యర్థుల పేర్లు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు నాలుగు నెలల సమయం ఇచ్చారు. ఈ సమయంలో వారు మెరుగుపడకపోతే కొత్తవారిని ఇన్ఛార్జిలుగా నియమిస్తారని తెలుస్తోంది. అక్టోబరు లేదా నవంబరు తర్వాత పార్టీలో కొత్త చేరికలు ఉండబోతున్నాయి.
రాపాక వరప్రసాద్కు సమన్వయ బాధ్యతలు అప్పగించడంతో ఆ నియోజకవర్గంలో ఇప్పటికే రెండుసార్లు వైసీపీ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలైన బొంతు రాజేశ్వరరావు తన సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఇలాంటి అసంతృప్తులను బుజ్జగించడానికి, నేతలను సర్దుబాటు చేయడానికి ముందస్తు అభ్యర్థుల ప్రకటన ఉపయోగపడుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొంది వైసీపీకి మద్దతుగా నిలిచిన నలుగురు ఎమ్మెల్యేలను వారి వారి స్థానాల్లోనే కొనసాగించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీరితోపాటు రాజోలు నుంచి జనసేన తరఫున గెలుపొంది వైసీపీకి మద్దతు పలుకుతున్న రాపాక వరప్రసాద్ను ఆ నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్తగా నియమించారు. కుప్పంలో చంద్రబాబునాయుడుమీద వైసీపీ అభ్యర్థిగా భరత్ నిలబడతారని పలమనేరులో జరిగిన ప్లీనరీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అభ్యర్థులపేర్లను ప్రకటించి అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలను ప్రాంతీయ సమన్వయకర్తలపై పార్టీ ఉంచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa