ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఇదిలావుంటే ఆయన భీమవరం పర్యటనకు వెళ్లకుండా ఆగిపోయిన సంగతి తెలిసిందే. తన అనుచరుల కోసం వెనక్కు తగ్గాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి రఘురామ లేఖ రాశారు. ప్రధాని భీమవరం పర్యటన జాబితాలో తన పేరు లేకపోవడంపై ఫిర్యాదు చేశారు. స్థానిక ఎంపీగా ఉన్న తన పేరును అధికారులు ఆ జాబితాలో చేర్చలేదన్నారు. తన పేరు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు.. ప్రొటోకాల్ ప్రకారం ప్రధానిని స్థానిక ఎంపీ ఆహ్వానించాలని గుర్తు చేశారు. కానీ తనకు ఆహ్వానం లేకపోవడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నట్లు లేఖలో ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో పాల్గొనేవారికి సంబంధించి పీఎంవో నుంచి వచ్చిన జాబితాలో, వేదికపై ఉండేవారి జాబితాలో, హెలిపాడ్ దగ్గర ప్రధానిని ఆహ్వానించేవారి జాబితాలో రఘురామ పేరు లేదని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు తెలిపారు. తాము ఎంపీ విషయంలో చట్ట ప్రకారమే నడుచుకుంటామని.. ప్రధాని కార్యక్రమానికి ఆయన ఎలా వస్తున్నారో తమకు తెలియదన్నారు. ఎంపీ మొబైల్ను నంబరును పోలీసుశాఖ బ్లాక్లిస్టులో పెట్టలేదని.. ప్రధాని పర్యటన సందర్భంగా ఫ్లయింగ్ జోన్కు సంబంధించి ఆంక్షలు ఉంటాయన్నారు. ఎవరైనా వాయుమార్గంలో రావాలంటే నిబంధనల ప్రకారం కచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సిందే అన్నారు.
మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ భీమవరం పర్యటనకు తాను హాజరుకావడం లేదని రఘురామ తెలిపారు. హైదరాబాద్లోని లింగంపల్లి నుంచి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో బయల్దేరిన ఆయన.. బేగంపేట రైల్వేస్టేషన్లో దిగిపోయారు. తన భీమవరం పర్యటన రద్దుకు గల కారణాలను వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. భీమవరంలో తన అనుచరులు కొందరిపై కేసులు నమోదయ్యాయని.. సుమారు 55 మందిని పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించారు. తాను వెళ్తే ఇంకా ఇబ్బంది పెడతామని వారికి చెబుతున్నారని.. తాను భీమవరం వెళ్లకపోతే వాళ్లను వదిలేస్తామని పోలీసులు చెప్పారన్నారు. తన శ్రేయోభిలాషుల శ్రేయస్సు కోసం ఒక అడుగు వెనక్కి వేయదలుచుకున్నాను అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa