ఓ టీవీ జర్నలిస్ట్ అరెస్ట్ పై యూపీలో హైడ్రామా కొనసాగింది. రెండు రాష్ట్రాల పోలీసులు అతని అరెస్ట్ కోసం పోటీపడ్డారు. వివరాలలోకి వెళ్లితే..కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై ఫేక్ వీడియో విషయంలో జీ టీవీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్ను నోయిడా పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ హైడ్రామా నెలకొంది. రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీకి చెందిన ఓ వీడియోను తప్పుడు రీతిలో ప్లే చేసిన కేసులో రోహిత్ రంజన్ను అరెస్ట్ చేయడానికి చత్తీస్గఢ్ పోలీసులు వెళ్లారు. కానీ అంతకు ముందే రోహిత్ రంజన్ స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో యూపీ పోలీసులు ఆ అరెస్ట్ను అడ్డుకుని వారితో తీసుకెళ్లారు.
అదుపులోకి తీసుకునే ముందు ఈ అరెస్ట్ వ్యవహారంపై రోహిత్ రంజన్ ఓ ట్వీట్ కూడా చేశారు. స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఛత్తీస్గఢ్ పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వచ్చారని, ఇది చట్టపరంగా సరైందేనా..? అని ప్రశ్నించారు. అయితే దీనికి రాయ్పుర్ పోలీసులు సమాధానం ఇచ్చారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ ఎలాంటి రూల్ లేదని, అయినా తాము తెలియజేశామని చెప్పారు. అలాగే అరెస్ట్ వారెంట్ కూడా చూపించాం, దర్యాప్తుకు సహకరించాలని చెప్పారు.
నిజానికి రాహుల్ ఫేక్ వీడియోని ప్లే చేసినందుకు ఆ టీవీ యాజమాన్యం క్షమాపణలు కూడా చెప్పింది. కానీ ఆ టీవీ ఛానల్ యాజమాన్యం, యాంకర్ రోహిత్ రంజన్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు రాయ్పుర్లో కేసు పెట్టారు. దాంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని వయనాడ్లో తన ఆఫీసుపై దాడి చేసిన వారిని చిన్నపిల్లలుగా పేర్కొంటూ.. వారికి వ్యతిరేకంగా తనకు ఎలాంటి దురుద్దేశం లేదని రాహుల్ గాంధీ వీడియో సందేశమిచ్చారు. దానిని వక్రీకరిస్తూ ఉదయ్పూర్కు చెందిన టైలర్ కన్హయ్యలాల్ హంతకులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఈ మాటలు అన్నట్టు ఓ టీవీ ఛానల్ ప్రసారం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. అలాగే రాహుల్పై నకిలీ వీడియో వ్యవహారానికి సంబంధించి ఛత్తీస్గఢ్లో ముగ్గురు బీజేపీ ఎంపీలపై కూడా కేసు నమోదైంది. వీరు ఆ వీడియోను సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి వినియోగించారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa