సెల్పీ సరదా ప్రాణాలను హరిస్తున్న ఎన్నో ఘటనలను మనం చూస్తున్నా ఇంకా ప్రజల్లో మాత్రం మార్పురావడంలేదు. సెల్పీల కోసం ఫోజులిస్తూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఎత్తైన జెయింట్ వీల్ పైనుంచి కిందపడి 26 ఏళ్ల ఓ యువతి తీవ్రంగా గాయపడింది. కోల్కతా నగరంలోని ఎంటాలీ ప్రాంతంలోని రామ్లీలా మైదానంలో ఆదివారం (జులై 3) సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. తలకు బలమైన గాయం కావడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి సీరియస్గా ఉంది. బాధితురాలిని ‘ప్రియాంక షా’గా గుర్తించారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులు చిత్తరంజన్ సాహా (55), మొహమ్మద్ ఉస్మాన్, ఫెర్రిస్ వీల్ ఆపరేటర్ బైద్యనాథ్ బహ్కర్ (20)పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నారని.. అయితే, అందులో జెయింట్ వీల్ గురించి ప్రస్తావించలేదని అధికారులు తెలిపారు. రథయాత్ర ఉత్సవం సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహించారని వెల్లడించారు. ఇందులో విద్యుత్తో పనిచేసే జెయింట్ వీల్ను అమర్చారని తెలిపారు.
బాధితురాలు పడిపోయినప్పుడు సీట్లో సరిగా కూర్చోలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి ఆమె అదుపుతప్పి కింద పడిందని కొంత మంది ప్రత్యక్ష సాక్షులు తెలిపారని విచారణ అధికారి చెప్పారు. జెయింట్ వీల్ ఒక్కసారిగా కుదుపునకు గురి కావడం వల్ల ఆమె కింద పడిపోయిందని మరి కొంత మంది పేర్కొన్నారు. యువతి కింద పడిపోవడానికి గల సరైన కారణాలను అన్వేషిస్తున్నామని పోలీసులు తెలిపారు.
బాధిత యువతిని వెంటనే ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్కు తరలించారు. ఎంటాలి పోలీస్ స్టేషన్లో ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎగ్జిబిషన్లో అన్ని రకాల వినోద సవారీలను రద్దు చేశారు. నిర్లక్ష్యం, భద్రతను గాలికొదిలేయడం, తీవ్రంగా గాయపడేందుకు కారణమవడం అభియోగాల కింద నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిలువునా కిందపడిపోవడంతో బాధితురాలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa