ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతికూల వాతావరణ నేపథ్యంలో..అమర్ నాథ్ యాత్రకు బ్రేక్

national |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 02:59 AM

వర్షాల కారణంగా మారిన వాతావరణ పరిస్థితుల నేపథ‌్యంలో అమర్‌నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. యాత్ర కొనసాగే మార్గంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. యాత్రికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, దుర్ఘటనలకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. కొవిడ్ సంక్షోభం కారణంగా రెండున్నరేళ్ల విరామం తర్వాత అమర్‌ నాథ్‌ యాత్ర జూన్ 30న తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండేళ్లకు పైగా విరామం రావడంతో ఈసారి యాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని అంచనా వేశారు.


3 వేల మంది యాత్రికులను బేస్‌ క్యాంపు వద్దే నిలిపివేశారు. ఇదే మార్గంలో వచ్చే మరో 4 వేల మందితో కూడిన బ్యాచ్‌ను రంబాన్‌ జిల్లా చాందర్‌కోట్‌లో ఉన్న యాత్రి నివాస్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూ నుంచి బాల్తాల్‌ మార్గంలో ఉన్న 2,000 మందిని మాత్రం మంచులింగ దర్శనానికి అనుమతించినట్లు తెలిపారు.


పహల్గామ్‌ మార్గంలో వెళ్లే వారికి అనుమతి ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. అమర్‌‌నాథ్‌లోని మంచు లింగాన్ని దర్శించుకునేందుకు శ్రీనగర్‌కు సుమారు 90 కి.మీ దూరంలోని పహల్గామ్‌ మార్గం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీంతోపాటు బాల్తాల్‌ పట్టణం మీదుగా మరో మార్గం ఉంది. ఆయా మార్గాల్లోని బేస్‌ క్యాంపుల నుంచి బ్యాచ్‌ల వారీగా యాత్రికులను పంపిస్తారు.


సైనిక బలగాల భారీ భద్రత నడుమ అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతుంది. ఈసారి యాత్రా మార్గాల్లో డ్రోన్లు, ఇతర సాధనాలతో హై టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో నిఘా కట్టుదిట్టం చేశారు. యాత్రా మార్గంలో ఇబ్బందులకు గురైన భక్తులను హెలికాప్టర్ల సాయంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమర్‌నాథ్ యాత్ర నుంచి తిరిగొస్తూ హిమాలయ శ్రేణుల్లో జారిపడిన 50 ఏళ్ల ఓ యాత్రికుడిని జవాన్లు కాపాడి సురక్షితంగా తీసుకొస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇదిలావుంటే ఇప్పటివరకు 72 వేల మంది హిమలింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా 6,000 మందితో కూడిన ఆరో బ్యాచ్‌ 239 వాహనాల కాన్వాయ్‌తో సీఆర్‌పీఎఫ్‌ భద్రత నడుమ బయలుదేరినట్లు వెల్లడించారు. పహల్గామ్‌ నుంచి గతవారం బయలుదేరిన బ్యాచ్‌లు ఇప్పటికే దర్శనం చేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈసారి యాత్రకు 8 వేల మంది భక్తులు రావొచ్చని అంచనా వేశారు.


ఈ ఏడాది జూన్‌ 30న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర 43 రోజులపాటు కొనసాగనుంచి. సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్‌ రోజున అమర్‌నాథ్‌ యాత్ర ముగుస్తుంది. యాత్రకు వెళ్లలేని భక్తులకు ఆన్‌లైన్‌ ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా ప్రసాదాలను పొందే ఏర్పాట్లను కూడా దేవస్థానం బోర్డు చేసింది. యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఏటా లక్షలాది మంది భక్తులు మంచులింగాన్ని దర్శించుకునేందుకు వచ్చే ఈ యాత్ర ద్వారా కశ్మీర్ లోయలో వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa