టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంపై వైసీపీ ప్రధానంగా నజర్ పెట్టింది. ఈ నియోజకవర్గంలో ఎలాగైనా చంద్రబాబును ఓడించాలన్న టార్గెట్ పెట్టుకొన్న అధికార వైసీపీ ఆ దిశగా పావులు కదుపుతోంది. తాజాగా నారా చంద్రబాబు నాయుడి నియోజకవర్గం కుప్పంలో తెలుగుదేశం పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఒకేసారి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఫిరాయించారు. గుడిపల్లి మండలంలో టీడీపీకి 100 మందికి పైగా గుడ్ బై చెప్పారు. టీడీపీ సభ్యత్వ కార్డులను ప్రదర్శిస్తూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. కుప్పం ఇంఛార్జ్, ఎమ్మెల్సీ భరత్ నాయకత్వంలో ఈ చేరికలు జరిగాయి. తిరుపతిలోని మంత్రి పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం (జులై 5) ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు, అభివృద్ధి అనేక మందిని ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మూడేళ్ల పాలన చూశాక కుప్పంలోనూ వైఎస్సార్సీపీ జెండా ఎగరాలని స్థానికులు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కులం, మతం, రాజకీయ పార్టీలు చూడకుండా పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్దేనని మంత్రి పెద్దిరెడ్డి కొనియాడారు. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యం లభిస్తుందన్నారు.
రానున్న రోజుల్లో కుప్పం నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. కుప్పంలో టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయం అని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో కుప్పంలో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో టీడీపీ మాజీ సర్పంచ్ వెంకటేష్, సీబీ సబ్రమని, యల్లప్ప, సంపంగి తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa