కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక మసీదుల అంశం వివాదాస్పదంగా మారుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆగ్రాలోని (ఉత్తరప్రదేశ్) చారిత్రక షాహి జామా మసీదులో తవ్వకాలకు భారత పురావస్తు పరిశోధన శాఖ (ఆర్కియోలాజికల్)ను ఆదేశించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది వరుణ్ కుమార్ దీన్ని దాఖలు చేశారు. మసీదు మెట్ల కింద ‘ఠాకూర్ కేశవ్ దేవ్ జీ’ విగ్రహ మూర్తి ఉన్నట్టు ఆయన వాదిస్తున్నారు. ఇదే అంశంపై వరుణ్ కుమార్ గతేడాది ఏప్రిల్ 14న మధుర సివిల్ జడ్జి కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయగా, అక్కడ విచారణకు తీసుకోలేదు.
ఈ మసీదును షాజహాన్ కుమార్తె జహన్ అరా ప్రారంభించినట్టు జామా మసీదు ప్రతినిధి ఇమాముద్దీన్ తెలిపారు. తన వివాహం కోసం దాచుకున్న డబ్బును ఆమె మసీదు నిర్మాణానికి వినియోగించినట్టు చెప్పారు. జామా మసీదు మెట్ల కింద దేవతా విగ్రహం ఉందనడానికి బలమైన ఆధారాలు లేవని చెప్పారు. కనుక ఒకరి ఇష్టానుసారం మసీదు మొత్తాన్ని తవ్వడం సమర్థనీయం కాదన్నారు. మరోవైపు హిందుస్థానీ మిరాదారి వైస్ చైర్మన్ విశాల్ శర్మ స్పందిస్తూ ఈ తరహా వ్యాజ్యాలు సమాజంలో అశాంతిని కలిగించేందుకు ఉద్దేశించినవిగా పేర్కొన్నారు. వీటిని ఎంత మాత్రం ప్రోత్సహించరాదని అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa