అధికార పక్షానికి ఒక న్యాయం ప్రతిపక్షానికి మరో న్యాయమా అంటూ టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తే ఆర్టీసీ బస్సులకు, ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఇవ్వలేదని, రాజధాని అమరావతి కోసం రైతులు నిర్వహించిన పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని ఇక ఇప్పుడు వైసిపి ప్లీనరీకి మాత్రం రెడ్ కార్పెట్ వేసి మరీ సేవలు చేస్తున్నారంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నాగార్జున యూనివర్సిటీ కి సెలవు ఇచ్చి మరీ వైసీపీ ప్లీనరీ నిర్వహించడం దేనికని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
ప్లీనరీ పేరుతో జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ప్లీనరీ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీకి పది కోట్ల రూపాయల నష్టం అని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పి, మూడు సార్లు టికెట్ చార్జీలు పెంచారని గుర్తు చేసిన అచ్చెన్నాయుడు ప్రతిపక్ష పార్టీల సభలు పెట్టుకుంటే కుంటి సాకులు చెప్పి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసే ప్రభుత్వం, నేడు వైసిపి ప్లీనరీ కి మాత్రం సకల మర్యాదలు చేస్తోందంటూ మండిపడ్డారు. అంతేకాదు డ్వాక్రా మహిళలను బెదిరించి ప్లీనరీకి తరలిస్తున్నారని ఆరోపణలు గుప్పించిన అచ్చెన్నాయుడు స్కూల్ బస్సులు, ప్రైవేటు వాహనాలను బలవంతంగా లాక్కుంటున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ పై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. వైసీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం పేలవంగా ఉందని వర్ల రామయ్య పేర్కొన్నారు. జగన్ తాను ముఖ్యమంత్రిని అన్న విషయం మరిచి, కేవలం ప్రతిపక్ష నేతను తిట్టడం కోసమే తన సమయాన్ని వెచ్చించినట్టు కనిపించిందని వర్ల రామయ్య పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa