తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. ఓ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని మృతి చెందడంతో స్థానికులు ఆగ్రహానికి గురై ఆదివారం ఆ స్కూల్ను చుట్టుముట్టారు. విద్యార్థిని మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు మూడు పోలీసు వాహనాలతో సహా కనీసం 13 బస్సులకు నిప్పంటించారు. వారిపై రాళ్లు రువ్వారు, స్కూల్లో ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. చిన్న సేలం సమీపంలోని కనియమూర్లోని రెసిడెన్షియల్ స్కూల్పై జరిగిన ఈ దాడిలో పోలీసు అధికారులతో సహా పలువురు గాయపడ్డారు.
ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని 17 ఏళ్ల బాలిక జూలై 13న హాస్టల్ ప్రాంగణంలో శవమై కనిపించింది. హాస్టల్లో మూడో అంతస్తులోని ఓ గదిలో ఉంటున్న బాలిక.. ఆ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక హాస్టల్ గదిలో ఓ సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తను కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యానని, దాని పట్ల కొందరు ఉపాధ్యాయులు తన పట్ల దారుణంగా వ్యవహరించారని రాసినట్టు పోలీసులు తెలిపారు.
దాంతో ఆ విద్యార్థిని మృతికి స్కూల్ యాజమాన్యమే కారణమని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారికి మద్దతుగా గ్రామస్థులు కూడా నిలిచారు. అదే రోజు రెండు వేల మంది పాఠశాల దగ్గరకు వెళ్లి నిరసన తెలియజేశారు. అయితే అప్పుడు పాఠశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బుధవారం నిరసనలు విరమించారు.
కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆదివారం మళ్లీ స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. ఆదివారం ఉదయం పది గంటలకు తమ నిరసనలను ప్రారంభించారు. అది కాస్తా హింసాత్మకంగా మారాయి. ఒక గుంపు రాళ్లు రువ్వారు. పాఠశాల భవనం, తరగతి గదులను, ప్రిన్సిపాల్ కేబిన్ను ధ్వంసం చేశారు. క్యాంపస్లో ఆపి ఉంచిన పాఠశాల బస్సులకు నిప్పు పెట్టారు. ఇలా 13 బస్సులపై దాడి చేయగా.. వాటిలో ఎక్కువ భాగం దగ్ధమయ్యాయి. మూడు పోలీసు వాహనాలకు కూడా దహనం చేసి విధ్వంసం సృష్టించారు. నిరసనకారులు విద్యార్థినికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అయితే ఈ ఆందోళనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. నిందితులకు తప్పకుండా శిక్షపడుతుందని హామీ ఇస్తూ ట్వీట్ చేశారు. హింసాత్మక ఘటన తనను ఆందోళనకు గురి చేస్తుందని, బాలిక మృతిపై పోలీసుల విచారణ పూర్తికాగానే నిందితులను శిక్షిస్తామని పేర్కొన్నారు. వెంటనే కళ్లకురిచ్చికి వెళ్లాలని డీజీపీ, హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. శాంతియుతంగా ఉండాలని ఆందోళనకారులను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa