దేశవ్యాప్తంగా విమాన సేవలు అందించేందుకు మరో కొత్త సంస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ స్టాక్ మార్కెట్ మదుపరి రాకేశ్ ఝున్ఝున్వాలా మద్దతు ఉన్న ఆకాశ ఎయిర్ (Akasa Air) ఆగస్టు 7నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.తమ తొలి సర్వీసును ముంబయి-అహ్మదాబాద్ మధ్య నడపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటికే టికెట్ బుకింగ్లు ప్రారంభించినట్లు తెలిపింది.
ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి మధ్య కూడా సేవలు ప్రారంభిస్తామని ఆకాశ ఎయిర్ (Akasa Air) ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి కూడా టికెట్లు ఇప్పటి నుంచే బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలతో తమ వాణిజ్య కార్యకలాపాలకు కంపెనీ శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఒక విమానం భారత్కు చేరుకుంది. మరొకటి ఈ నెలాఖరు వరకు కంపెనీ చేతికి అందనుంది.
దశలవారీగా ఇతర నగరాలకు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తామని కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రవీణ్ అయ్యర్ తెలిపారు. ఈ ఏడాది ప్రతినెలా తమ కంపెనీకి రెండు కొత్త విమానాలు అందుతాయని పేర్కొన్నారు. విమానయాన నియంత్రణా సంస్థ డీజీసీఏ నుంచి ఈ నెల 7న ఆకాశ ఎయిర్ (Akasa Air) 'ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్' (AOC) అందుకుంది. మొత్తం 72 మ్యాక్స్ విమానాల కోసం కంపెనీ గత ఏడాది నవంబరులో బోయింగ్తో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa