డబ్బు బంధుత్వాలను, స్నేహితులను సైతం మార్చేస్తుందన్నది మనం వినేవుంటాం. కానీ అదే డబ్బు కొందరిని కిరాతకులుగా మార్చేస్తుందన్నది ఈ ఘటనతో తెలుస్తుంది. ఐదు వందల రూపాయల కోసం జరిగిన గొడవ చివరికి ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. అప్పుగా ఇచ్చిన రూ.500 తిరిగి ఇవ్వాలని అడగడంతో.. జీర్ణించుకోలేకపోయిన వ్యక్తి అనుచరులను వెంటబెట్టుకొని వచ్చి అర్ధరాత్రి కత్తితో గొంతు కోసం దారుణంగా హతమార్చారు. ఈ ఘటన విశాఖ జిల్లా పెదవాల్తేరు పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల మేరకు.. పెదవాల్తేరుకు చెందిన 28 సంవత్సరాల కారు డ్రైవర్ ధర్మాల అప్పలరెడ్డి (అప్పన్న) గతంలో రౌడీషీటర్ గౌరీశంకర్కు రూ.500 అప్పు ఇచ్చాడు. శుక్రవారం రాత్రి గౌరీశంకర్ కనిపించడంతో తన వద్ద తీసుకున్న రూ. 500 ఇవ్వాలని అడిగాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. స్థానికులు సర్దిచెప్పి ఇళ్లకు పంపించేశారు. అయితే గౌరీశంకర్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అనుచరులను వెంటబెట్టుకొని శుక్రవారం అర్ధరాత్రి అప్పన్న ఇంటికి వచ్చాడు.
గొడవ సర్దుమణగడంతో అప్పన్న ఇంటి సమీపంలోని బైక్పై కూర్చొని సెల్ఫోన్ చూసుకుంటున్నాడు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన గౌరీశంకర్ కత్తితో మెడపై దాడి చేశాడు. అప్పన్న కింద పడటంతో మరో ఐదు పోట్లు పొడిచి దారుణంగా హతమార్చాడు. అడ్డుకునేందుకు వచ్చిన అప్పన్న అత్త, భార్యపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించగా వారు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత అప్పన్నను ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి ఎంపీపీ పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని బాధితులను పరామర్శించారు. నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa