మంగళగిరి నియోజకవర్గం కుంచనపల్లి బైపాస్ వద్ద నూతనంగా నిర్మించిన తాడేపల్లి మండల టిడిపి కార్యాలయాన్ని నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కుంచనపల్లి గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్తలకు పసుపు కండువాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గడపగడపకు వెళ్తోన్న వైసిపి ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయడమే మార్పుకి నాంది. జనం నిలదీస్తారనే భయంతో సీఎం జగన్రెడ్డి 144 సెక్షన్ పెట్టుకుని బయటకొస్తున్నారు. మూడేళ్లుగా తాడేపల్లి కొంపలో నిద్రపోయిన జగన్రెడ్డి జనం వరదల్లో వుంటే 15 రోజులైతే కానీ స్పందించలేదు. ఇంట్లో కుక్కని పెంచుకున్నా పన్నులు వేసే స్థాయికి దిగజారిపోయాడు.
జగన్ రెడ్డికి కలలో కూడా చంద్రబాబు గారే కనిపిస్తున్నారు. నియోజకవర్గ ప్రజల్ని మోసగించి కరకట్ట కమల్ హాసన్ నటనకి వచ్చే ఎన్నికల్లో ప్యాకప్ ఖాయం. గెలిచిన కరకట్ట కమల్ దోచి దాచుకునే పనిలో వుంటే, ఓడిపోయిన నేను నిత్యమూ నియోజకవర్గ ప్రజల సేవలో వున్నాను. పెళ్లి కానుక, పండుగ కానుకలు, స్వయం ఉపాధికి తోపుడు బళ్లు అందించాను. యువతకి, మహిళలకు ఉపాధి శిక్షణ ఇప్పిస్తున్నాను.
మంగళగిరిలో అన్న క్యాంటీన్ పెట్టామని 60 మందిపై అక్రమ కేసులు బనాయించారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గేది లేదు. తాడేపల్లిలోనూ అన్న క్యాంటీన్ ఆరంభిస్తున్నాం. వారంలో దుగ్గిరాలలో సంజీవని ఆరోగ్య రథం ప్రారంభిస్తాం. త్వరలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాలలో సంజీవని ఆరోగ్య కేంద్రాల ద్వారా పేదలకు ఉచితంగా మందులు ఇవ్వబోతున్నాం. అంతా కలిసి ఇగోలు పక్కన పెట్టి పనిచేయండి. మంగళగిరిలో పసుపు జెండా ఎగరేస్తున్నాం అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa