వైసీపీ సర్కార్ కు మరోమారు ఏపీ హైకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఏపీలోని వై.ఎస్.జగన్ సర్కార్కు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఈ స్కీమ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కార్పొరేట్ తరహా స్కూళ్లలో చదువుతున్నారని.. ప్రభుత్వం తీసుకున్న రద్దు నిర్ణయంతో విద్యార్థులు ఇబ్బందిపడతారన్నారు. ఈ స్కీమ్ ద్వారా కార్పొరేట్ పాఠశాలల్లో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులను కొనసాగించాలని కోరారు.
ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ధర్మాసనం.. ఇప్పటికే ఈ స్కీమ్ కింద చదువుతున్న విద్యార్థులను పదో తరగతి పూర్తయ్యేవరకు కొనసాగించాలని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో 49 వేల మంది ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఊరట లభించనుంది. పిల్లల విద్య కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోర్టు ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో ప్రతిభ కనబరిచినవారికి కార్పొరేట్ స్కూల్స్లో చదువు కోసం ఈ స్కీమ్ అమలు చేస్తున్నారు.
2008లో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ను తీసుకొచ్చారు. 2019-20లో వరకు కొనసాగింది. స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో 1, 5, 8 తరగతుల్లో ప్రవేశాలు కల్పించే వాళ్లు.. వీరి ఫీజులు ప్రభుత్వమే చెల్లించేది. ఒకటో తరగతి విద్యార్థులకు లాటరీ ద్వారా, 5, 8 తరగతుల విద్యార్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసేవారు. ఈ స్కీమ్కు సంబంధించి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.65 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేలలోపు ఉన్నవారు మాత్రమే అర్హులు.
రెసిడెన్షియల్ విద్యార్థులకు ఏడాదికి రూ.30 వేలు, నాన్ రెసిడెన్షియల్ వారికి రూ.20 వేలు చొప్పున మంజూరు అయ్యాయి. ఇలా 10వ తరగతి వరకు అవకాశం కల్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి నిధులు నిలిపివేయడంతో ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు కోర్టును ఆశ్రయించగా ఊరట లభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa