ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెహ్రు..వాజ్ పేయి విధానాలను విమర్శించి...మోడీని సైతం తప్పుపట్టి

national |  Suryaa Desk  | Published : Wed, Aug 03, 2022, 05:28 PM

సొంత పార్టీ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడుతున్న భారతీయ జనతా పార్టీ అసమ్మతి నేత సుబ్రహ్మణ్య స్వామి తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చాంశనీయంగా మారాయి. ఆయన టిబెట్, తైవాన్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధానులు నెహ్రూ, వాజ్ పేయి విధానాలను తప్పుబట్టడమే కాకుండా, ప్రస్తుత ప్రధాని మోదీని సైతం విమర్శించారు. ఈమేరకు ఒక తాజా ట్వీట్ వదిలారు.


‘‘నెహ్రూ, ఏబీవీ (అటల్ బీహారీ వాజ్ పేయి) అవివేకం వల్లే టిబెట్, తైవాన్ చైనాలో అంతర్భాగమని భారతీయులం అంగీకరించాం. కానీ, చైనా ఇప్పుడు కనీసం వాస్తవాధీన రేఖను కూడా గౌరవించడం లేదు. లడఖ్ లోని సరిహద్దు భాగాలను ఆక్రమించుకుంటోంది. మోదీ మాత్రం జడత్వంతో ఎవరూ రాలేదని చెబుతున్నారు. మా దగ్గర ఎన్నికలు ఉన్నాయని చైనా తెలుసుకోవాలి’’ అంటూ స్వామి ట్వీట్ చేశారు. 


అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటిస్తున్న సమయంలో స్వామి ఈ అంశాన్ని లేవనెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొంత కాలంగా సుబ్రహ్మణ్య స్వామి సొంత పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపిస్తుండడం తెలిసిందే.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa