సినీ నటుడు..30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్విరాజ్ రాజకీయంగా కొత్త ఎంట్రీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పని చేయటానికి సిద్దమయ్యారు. జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. మెగా బ్రదర్ నాగబాబు తో సమావేశమైన పృధ్విరాజ్ వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆయన పోటీకి పార్టీ నుంచి హామీ లభించినట్లుగా సమాచారం. అందులో భాగంగా పృధ్విరాజ్ కు నియోజకవర్గం కూడా ఫిక్స్ అయిపోయింది. గతంలో పృధ్విరాజ్ వైసీపీలో పని చేశారు.
జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయనకు మద్దతుగా వ్యవహించారు. వైసీపీకి అనుకూల వాయిస్ వినిపించే క్రమంలో రాజకీయ ప్రత్యర్ధుల పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ సీఎం అయిన తరువాత పృధ్విరాజ్ కు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీబీసీ ఛైర్మన్ గా నియమించారు. అయితే, ఆ సమయంలోనే ఆయన పైన కొన్ని లైంగిక ఆరోపణలు వచ్చాయి. వీటి పైన టీటీడీ విచారణకు ఆదేశించింది. దీంతో పాటుగా పృధ్విరాజ్ ను ఆ పదవి నుంచి తప్పించింది. అయితే, ఆ విచారణకు సంబంధించిన నివేదిక పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. ఇక, అప్పటి నుంచి కొంత కాలం మౌనంగా ఉన్న పృధ్విరాజ్ కరోనాతో బాధ పడ్డారు. ఆ సమయంలో చిరంజీవి తనకు ప్రాణం నిలబెట్టారంటూ పృధ్వి చెప్పుకొచ్చారు.
పలు సందర్భాల్లో మెగా కుటుంబం గురించి గొప్పగా చెబుతూ వచ్చారు. పలు ఇంటర్వ్యూల్లో వైసీపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో..ఆయన జనసేనకు దగ్గర అవుతారని అంచనాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ మెగా బ్రదర్ నాగబాబుతో సుదీర్ఘ మంతనాలు చేసారు. పార్టీలో చేరటంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నిర్ణయించారు.
తన సొంత జిల్లా పశ్చిమ గోదావరి లోని తాడేపల్లి గూడెం నుంచి పృధ్విరాజ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు జనసేన అధినాయకత్వం నుంచి హామీ లభించింది. 2019 ఎన్నికల్లో ఇదే జిల్లా భీమవరం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసారు. ఈ సారి ఉభయ గోదావరి జిల్లాల్లోని ఒక నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.
ఇక, నాగబాబు గత ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేయగా..ఈ సారి ఎన్నికల్లొ ఆయన పోటీకి దిగటం లేదు. ఇక, గోదావరి జిల్లాల్లో జనసేన బలం పెంచుకుంటుందనే అంచనాల నడుమ ఇప్పుడు పృధ్విరాజ్ పార్టీలోకి ఎంట్రీ..దాదాపుగా జనసేన నుంచి తొలి అభ్యర్ధిగా నియోజకవర్గం సైతం ఫైనల్ అయింది. దీనికి పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే, పృధ్విరాజ్ పార్టీలో చేరినప్పటి నుంచి వైసీపీ ..సీఎం జగన్ టార్గెట్ గా పని చేసే అవకాశం కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa