గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వైసీపీ ఎమ్మెల్యేలకు, నాయకులకు, రాష్ట్ర మంత్రులకు వణకుపుట్టిస్తోంది. ఎక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా జనంలోకి వెళ్లినా ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కనిగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్కు చేదు అనుభవం ఎదురయ్యింది. సమస్యలు పరిష్కరించని నాయకుడు తమకు అవసరం లేదని ఆయన ముఖంపైనే తెగేసి చెప్పారు. ఈ ఘటన వెలిగండ్ల మండలంలోని పెరుగుపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ప్రజలు ఎదురుతిరగడంతో ఎమ్మెల్యే బిత్తరపోయి పరాభవంతో వెనుదిరిగారు. శనివారం పెరుగుపల్లిలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ హాజరయ్యారు.
గతంలో పెరుగుపల్లికి చెందిన 15ఎకరాల పశువుల బీడును కొంతమంది ఆక్రమించుకున్నారని, ఎన్నికల ముందు సమస్యను పరిష్కరిస్తామని మధుసూదన్ యాదవ్ హామీ ఇచ్చారు. తాజాగా, ఈ అంశాన్ని గ్రామస్థులు నిలదీశారు. అదేవిధంగా స్థానిక సర్పంచ్ మంజుభార్గవిని అవమానపరిచేలా సమాచారం ఇవ్వకుండా హుస్సేన్పురం, తమ్మినేనిపల్లి గ్రామాల్లో గడపగడపకు కార్యక్రమం నిర్వహించిన తీరుపై ఎమ్మెల్యేను కడిగిపారేశారు. పశువుల బీడును తిరిగి గ్రామానికి అప్పగిస్తానని హామీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పట్టించుకోలేదని ప్రశ్నించారు.
ఆ స్థలాన్ని గ్రామానికి అప్పగించేంత వరకు మా గ్రామంలోకి రావద్దంటూ తెగేసి చెప్పారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న స్థానిక సీఐ పాపారావు తమ సిబ్బందితో పెరుగుపల్లికి చేరుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయినప్పటికీ గ్రామస్థులు తగ్గకపోవడంతో ఎమ్మెల్యే గడపగడపకు కార్యక్రమాన్ని ఆపేసి వెనుదిరిగారు.
ఈ సమయంలో ఎమ్మెల్యేని అడ్డుకున్న మహిళలపై వెలిగండ్ల ఎస్ఐ వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే వెళ్లిపోయాక వారితో వాగ్వివాదానికి దిగారు. మహిళలు కాబట్టి వదిలేశానని, లేకపోతే పరిస్థితి వేరుగా ఉండేదని బెదిరింపు ధోరణితో మాట్లాడారు. ఎస్ఐ బెదిరింపులకు దిగడంతో మహిళలు ఆందోళన చెందారు. ఎమ్మెల్యేనే కావాలని పోలీసులను తమపైకి ఉసిగొల్పాడని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa