టీటీడీ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకొంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం రద్దు చేసింది. ఇది ఏ సమయంలో..ఎందుకో తెలుసా...? కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ను ఏకంతంగానే నిర్వహించారు. ప్రస్తుతం కరోనా అదుపులో ఉండటంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను మాడవీధుల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్యులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని మొదటిసారి రద్దుచేశారు. భక్తులందరికీ సర్వదర్శనం మాత్రమే కల్పించనున్నారు.
సెప్టెంబరు 27 శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో తమిళులకు ఎంతో ముఖ్యమైన పెరటాసి మాసం ప్రారంభం కానుంది. దీంతో ఆ రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు రానున్నారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ లక్ష మందిపైగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఉత్సవాల్లో ప్రాముఖ్యత ఉండే గరుడసేవ రోజున మరింత ఎక్కువగా వస్తారు.
బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దుచేస్తుంటారు. అలాగే, వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, శ్రీవాణి ట్రస్టు సేవల భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శన సౌకర్యాలను నిలిపివేస్తుంటారు. ఈసారి వాటితో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లనూ కూడా నిలిపివేసింది. బ్రహ్మోత్సవాల పది రోజులూ వీటిని రద్దుచేయడంతో సామాన్యులకు దర్శనభాగ్యం కల్పించినట్లు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. నిర్దేశిత సమయంలో స్వామి దర్శనం పూర్తి చేసుకుంటామన్న భరోసాతో భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు తీసుకుంటారు.
ఈ సేవ ద్వారా గంటకు 4వేల నుంచి 4,500 మంది భక్తులకే దర్శనం కల్పించేందుకు ఆస్కారం ఉంది. ఇక, శ్రీవారికి రోజువారీ కొన్ని సేవలు తప్పక నిర్వహించాలి. ఇందుకోసం రోజుకు ఐదారు గంటలు పడుతుంది. రాత్రి ఒంటిగంటకు ఏకాంత సేవలు ముగించినా తిరిగి తెల్లవారి 3 గంటలకు సుప్రభాతంతో ప్రారంభించాలి. అంటే దర్శన విరామంతోపాటు వివిధ సేవలకు 8 గంటల కేటాయించాలి. మిగిలిన 16 గంటల్లోనే ప్రత్యేక ప్రవేశం, సర్వదర్శనం భక్తులకు దర్శనం కల్పించడం సాధ్యం కాదని అధికారులు గుర్తించారు. వీటిని దృష్టిలో ఉంచుకొని సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల జారీని నిలిపివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa