మనదేశంపై ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్ కు చైనా బాసటగా నిలుస్తోంది. పాకిస్థాన్ ను అడ్డాగా చేసుకుని చెలరేగిపోతున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు విధించాలన్న భారత్, అమెరికా ప్రతిపాదనలకు చైనా మోకాలడ్డుతోంది. ఈ ప్రతిపాదన ముందుకు కదలకుండా చైనా కావాలనే ఆలస్యం చేస్తోందని దౌత్యవేత్తలు చెబుతున్నారు. జైషే మహ్మద్ కు చెందిన అబ్దుల్ రవూఫ్ అజహర్ పై అంతర్జాతీయ ప్రయాణ నిషేధం విధించాలని, అతడి ఆస్తులను స్తంభింపజేయాలని భారత్, అమెరికా కోరుతున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని 15 సభ్య దేశాలతో కూడిన ఆంక్షల కమిటీ ఈ ప్రతిపాదనను ఆమోదిస్తేనే ఇది కార్యరూపం దాల్చుతుంది.
అయితే చైనా తనకున్న విశేషాధికారంతో ఈ ప్రక్రియను తొక్కిపెట్టింది. భారత్, అమెరికా తెరపైకి తెచ్చిన ఈ ప్రతిపాదనను తాము మరింత అధ్యయనం చేయాల్సి ఉందని ఐక్యరాజ్యసమితిలో చైనా అధికార ప్రతినిధి వెల్లడించారు. సభ్యదేశాల ప్రతిపాదనలను నిలుపుదల చేయడం, అధ్యయనం చేయడం కొత్తేమీ కాదని, గతంలోనూ ఇలాంటివి చోటుచేసుకున్నాయని చైనా తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa