నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై వస్తున్న తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని, కుటుంబ గోప్యతకు భంగం కలిగించవద్దని వారు విజ్ఞప్తి చేశారు."ధర్మేంద్ర గారు కోలుకుంటున్నారు. చికిత్సకు స్పందిస్తున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని మనమందరం ప్రార్థిద్దాం" అని సన్నీ డియోల్ బృందం ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరూ అనధికారిక వార్తలను ప్రచారం చేయవద్దని ఆయన బృందం ముందు నుంచీ కోరుతోంది.గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో ధర్మేంద్ర మరణించారంటూ తప్పుడు వార్తలు వ్యాపించాయి. ఈ వదంతులను నిజమని నమ్మిన కొందరు ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం సంతాప సందేశాలు పోస్ట్ చేశారు. ఈ తప్పుడు ప్రచారంపై నటి, ధర్మేంద్ర అర్ధాంగి హేమమాలిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది క్షమించరానిది, అత్యంత బాధ్యతారహితమైన చర్య. చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యత గల ఛానెళ్లు ఎలా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తాయి? దయచేసి కుటుంబానికి, వారి గోప్యతకు గౌరవం ఇవ్వండి" అని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa