తాను ఉన్నత స్థితిలో ఉన్నారంటే కారణం అభిమానులే అని చెబుతారు సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి. అభిమానులని ప్రాణంగా ప్రేమించే చిరంజీవి వారికి ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సహాయంతో రాజనాల నాగలక్ష్మీ అనే మహిళకు బంజారాహిల్స్ లోని స్టార్ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. చిరంజీవి సహాయంతో ఆమెకు ఈ ఆపరేషన్ స్టార్ ఆస్పత్రి సీఎండీ ఎం.గోపిచంద్ ఆధ్వర్యంలో జరిగింది. చిరంజీవి ఆమె గుండె ఆపరేషన్ కు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. గుంటూరు జిల్లాకు చెందిన మెగా అభిమాని, అంజనా మహిళా సేవా సంస్థ అధ్యక్షురాలు రాజనాల నాగలక్ష్మి కి ఆపరేషన్ పూర్తికాగానే గోపిచంద్ చిరంజీవికి ఫోన్ చేసి విజయవంతమైందని తెలియజేయడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అఖిల భారత చిరంజీవి యువత రవణం స్వామినాయుడు ఆమెకు హైదరాబాద్ రావడానికి ఏర్పాట్లు చేసి రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులను ఒప్పించి ఆస్పత్రికి చేర్చించినందుకు చిరంజీవి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం నాగలక్ష్మీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. సోమవారం ఆమెని స్టార్ హాస్పిటల్ వైద్యులు ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి తరలించారు. లాక్ డౌన్ కారణంగా తన అభిమానిని కలిసే ఛాన్స్ లేకపోవడంతో చిరంజీవి, సురేఖ దంపతులు స్వయంగా నాగలక్ష్మితో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన అభిమాన నటుడు స్వయంగా కాల్ చేయడంతో నాగలక్ష్మీ ఆనందం వ్యక్తం చేసింది. ఈ జన్మకి ఇది చాలు. ముక్కోటి దేవతలు చిరంజీవిని, వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని నాగలక్ష్మీ ఎంతో భావోద్వేగంతో తన భావాలని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa