లాక్ డౌన్ కారణంగా ఓటీటీ సంస్థలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు అంతకుమించిన భారీ వ్యూయర్ షిప్ అందుతోంది. ఈ సంస్థలు కూడా ఓ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తే మంచి ఆఫర్ను నిర్మాత ముందుంచుతున్నారు. అందులో భాగంగా తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య నాని నటించిన వి, రామ్ హీరోగా వస్తోన్న రెడ్ సినిమాలు ఓటీటీలో విడుదలకానున్నాయని టాక్ నడిచింది. కానీ విడుదలకాలేదు. అయితే ఇప్పటికే తెలుగులో అమృతరామమ్ అనే సినిమా థియేటర్లో రిలీజ్ కాకుండా డెరెక్ట్గా ఓటీటీలో విడుదలై పరువాలేదనిపించింది. అయితే తాజా సమాచారం మేరకు అందాలతార కీర్తి సురేష్ నటించిన 'పెంగ్విన్' అనే తమిళ చిత్రం కూడా ముందుగా డిజిటల్ మీడియా ద్వారా విడుదల కానుంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ఈ చిత్రాన్ని లాక్ డౌన్ కారణంగా థియేటర్లలో కాకుండా, అమెజాన్ ప్రైమ్ ద్వారా వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా అదే పేరుతో స్ట్రీమ్ కానుంది. ఈ హవా హిందీలోను కూడా కనపడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈద్ సందర్భంగా మే 22న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ ఈ కరోనా వల్ల అది సాధ్యపడేలా లేదు.ఈ నేపథ్యంలో డిస్నీ హాట్ స్టార్స్ లో లక్ష్మీ బాంబ్ చిత్రం రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట చిత్రబృందం. దీనికి సంబందించి ఇప్పటికే మేకర్స్ డిస్నీ హాట్ స్టార్ వారితో సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తుంది. లక్ష్మీ బాంబ్ తెలుగు సినిమా కాంచనకు రీమేక్గా వస్తోంది. లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో అక్షయ్, నిర్మాత తుషార్ కపూర్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ప్రతినిధి విజయ్ సింగ్తో మూడు వారాలుగా ఓటీటీ ప్రతినిధులు వీడియో కాల్స్ ద్వారా చర్చలు జరిపారనీ, చివరకు ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారని తాజా సమాచారం. ఈ డీల్ ఖరీదు సుమారు వందకోట్లకు పైమాటేనట. ప్రస్తుతం సినిమాకు సంబందించి దర్శకుడు రాఘవ లారెన్స్ ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్నీ పూర్తి చేసే పనులో ఉన్నాడట. ఒకసారి ఆ పనులు పూర్తైతే ఇక ఓటీటీలో విడుదలే తరువాయి. ఇక ఇక్కడ ఇంకో విషయం ఏమంటే అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం కూడా ఓ 30 కోట్లకు డీల్ కుదిరిందని.. త్వరలోనే ఈ సినిమాను కూడా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్లో స్ట్రీమ్ కానుందని తాజా సమాచారం. తాజాగా అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన గులాబో సితాబో చిత్రం అమెజాన్ ప్రైమ్లో జూన్ 12న విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాను షూజిత్ సర్కార్ దర్శకత్వం దర్శకత్వం వహించాడు. అంతేకాదు మరో ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి నటించిన గూమ్కేతు మే 22న జీ5లో విడుదల కాబోతుంది. వీటికి తోడు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ నటించిన శ్రేషా, విద్యాబాలన్ ప్రధానపాత్రలో నటించిన శకుంతలా దేవి చిత్రాలు కూడా డైరెక్ట్గా డిజిటల్లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa