మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ''రిపబ్లిక్''. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ప్రస్థానం' ఫేమ్ దేవకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచింది.
'రిపబ్లిక్' చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేయబడిన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. అలానే 'గానా ఆఫ్ రిపబ్లిక్' లిరికల్ వీడియో కూడా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా ''జోర్ సే'' అనే సెకండ్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. 'సూడబోదమా ఆడబోదమా.. సెయ్యి సెయ్యి కలిపి సేర బోదమా.. జోర్సే బార్సే..' అంటూ సాగిన ఈ మాస్ నంబర్ కి మణిశర్మ సంగీతం సమకూర్చారు.
'జోర్ సే' పాటకు ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి - సాకీ శ్రీనివాస్ - బరిమిశెట్టి కలసి ఆలపించారు. జోష్ ఫుల్ గా సాగిన ఈ పాటలో సాయి తేజ్ ఎనర్జిటిక్ స్టెప్స్ అలరిస్తున్నాయి. ఇందులో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా కనిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత హార్ట్ ఫుల్ డాన్స్ చేసే అవకాశం 'జోర్ సే' సాంగ్ కల్పించిందని.. ఇది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నామని సాయి తేజ్ ట్వీట్ చేశారు.
జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ - జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పంజా అభిరామ్ పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నారు. రమ్యకృష్ణ - జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎమ్ సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మెగా మేనల్లుడికి 'రిపబ్లిక్' సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa