రాజకీయ నాయకుల జీవిత కథలతో తెరకెక్కే సినిమాల గురించి స్పందించడానికి ఫిలిం సెలబ్రెటీలు అంతగా ఇష్టపడరు. వీటి గురించి మాట్లాడితే తమ మీద ఒక ముద్ర పడిపోతుందనే భయం వారిలో ఉంటుంది. పార్టీలకు అతీతంగా అభిమానించే నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కిన "యన్.టి.ఆర్-కథానాయకుడు" గురించి స్పందించడానికి కూడా సినీ జనాలు వెనుకాడిన సంగతి తెలిసిందే.
చాలా కొద్ది మంది మాత్రమే ఈ సినిమా గురించి తమ అభిప్రాయం చెప్పారు. అలాంటిది వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద తీసిన "యాత్ర" సంగతి చెప్పేదేముంది? దాదాపుగా ఇండస్ట్రీ జనాలందరూ ఈ సినిమా విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. రేప్పొద్దున సినిమా రిలీజై.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా దీని గురించి స్పందిస్తారా అన్నది సందేహమే. అసలే ఇది ఎన్నికల సీజన్ కావడంతో సినీ జనాలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో యువ కథానాయకుడు సుధీర్ బాబు మాత్రం ధైర్యంగా "యాత్ర" ప్రి రిలీజ్ ఈవెంట్కు హాజరయ్యాడు. ప్రస్తుతం సుధీర్ కుటుంబం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తోంది. సుధీర్ తోడల్లుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం ఎంపీ అన్న సంగతి తెలిసిందే. సుధీర్ మావయ్య ఆదిశేషగిరి రావు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇలాంటి సమయంలో సుధీర్ వైఎస్ మీద తీసిన సినిమా వేడుకకు రావడం ఆశ్చర్యమే. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన విజయ్.. సుధీర్కు స్నేహితుడు. సుధీర్ సినిమా "భలే మంచి రోజు"తోనే అతను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అతడి కోసమే సుధీర్ ఈ వేడుకకు వచ్చాడు. అంతే కాక తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాను వ్యక్తిగతంగా వైఎస్కు అభిమానిని కాకపోయినా.. "యాత్ర" సినిమా కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నానని.. ఇది ఒక స్ఫూర్తినిచ్చే సినిమా అని అతను వ్యాఖ్యానించాడు. వైఎస్ను లెజెండ్గా అభివర్ణించిన సుధీర్.. ఆయన పాత్రలో మరో లెజెండ్ అయిన మమ్ముట్టి నటించడం గొప్ప విషయం అన్నాడు. మొత్తానికి సుధీర్ ఈ వేడుకకు రావడం.. ఇలా మాట్లాడటం అభినందనీయమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa