తెలుగులో గత వారం విడుదలైన ‘యాత్ర’ సినిమాకు సమీక్షకులందరూ మంచి రివ్యూలు, రేటింగ్స్ ఇచ్చారు. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా సానుకూలంగానే స్పందించారు. ఐతే దీనికి కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. ఈ సినిమాను ఫిలిం ఇండస్ట్రీ సరిగా ఓన్ చేసుకోలేదని, ప్రమోట్ చేయట్లేదని విమర్శలున్నాయి.
పనిగట్టుకుని ప్రమోట్ చేయాల్సిన పని లేదు కానీ.. సినిమా మీద తమ అభిప్రాయం చెప్పడానికి కూడా సెలబ్రెటీలు వెనుకంజ వేస్తుండటంపై చర్చ నడుస్తోంది. ఈ సినిమా గురించి స్పందిస్తే తమను వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులుగా ముద్ర వేస్తారన్న భయంతో సెలబ్రెటీలు వెనక్కి తగ్గుతున్నారన్న అభిప్రాయాలున్నాయి. వైఎస్ అభిమానులు ఈ విషయంలో పరిశ్రమ జనాల్ని తిట్టి పోస్తున్నారు. సినిమా గురించి స్పందించాలని సెలబ్రెటీల్ని డిమాండ్ చేస్తున్నారు.
ఐతే ఇది సరికాదని అంటున్నాడు ఆ చిత్ర దర్శకుడు మహి.వి.రాఘవ్. ఈ విషయమై అతనో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా చూడాలని, స్పందించాలని ఎవరినీ డిమాండ్ చేయొద్దని, అడుక్కోవద్దని అతను పిలుపు ఇచ్చాడు. ఇలాంటి డిమాండ్లు చేస్తే తన పనిని అవమానించినట్లే అని అతను అభిప్రాయపడ్డాడు. మన సినిమాను గుర్తించాలని వేరే వాళ్లను అడిగితే.. అప్పుడు మనం బిక్షగాళ్లం అవుతామని మహి అన్నాడు. ‘యాత్ర’కు ఎవరి ప్రశంసలూ అవసరం లేదని అతను స్పష్టం చేశాడు.
మరోవైపు ఈ చిత్ర నిర్మాత విజయ్ చిల్లా కూడా ఈ విషయమై ఆసక్తికర రీతిలో స్పందించాడు. ‘యాత్ర’ను ఒక పార్టీకి, రాజకీయాలకు ఆపాదించి చూడొద్దని.. అసలు సినిమా చూడకుండానే ఒక అభిప్రాయానికి రావొద్దని.. తమది నిజాయితీతో కూడిన ప్రయత్నం అని.. ఓపెన్ మైండ్తో సినిమా చూడాలని అతనన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa