ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ మంచి మజా అందించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో భువనేశ్వర్ అద్భుతమైన బౌలింగ్ వేయడంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లకు 201 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 58), నితీష్ కుమార్ రెడ్డి(42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్లతో 76 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా, హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 42 నాటౌట్) విరుచుకుపడ్డాడు. దీంతో హైదరాబాదజట్టు 20 ఓవర్లకిగాను 201 పరుగులు చేసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. సందీప్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 67), రియాన్ పరాగ్ (49 బంతుల్లో 77) రాణించినప్పటికీ, హైదరాబాద్ బౌలర్లో భువనేశ్వర్కుమార్ మూడు వికెట్లు తీయడంతో లక్ష్యాన్ని అందుకోలేకపోయింది ఆర్ఆర్ జట్టు. చివరి ఓవర్ లో వికెట్ తీసి విజయాన్ని అందించాడు. అయితే ఉప్పల్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులే కాక పలువురు సెలబ్రిటీలు సైతం వచ్చి సందడి చేశారు. టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఉప్పల్ మైదానంలో సందడి చేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఈ మ్యాచ్కు హాజరైంది. అనసూయ సన్రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్ని ఫుల్గా ఆస్వాదించింది.దీంతో అనసూయ అరుపులు.. సన్రైజర్స్ మెరుపులు అంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఉనాద్కత్ వేసిన 15వ ఓవర్లో రియాన్ పరాగ్ సిక్స్ కొట్టగా.. లాంగాన్లో అబ్దుల్ సమద్ క్యాచ్కు ప్రయత్నించినా అందలేదు. దాంతో అనసూయ ఇచ్చిన రియాక్షన్ వైరల్గా మారింది. స్టేడియంలో మ్యాచ్ చూడడం ఇదే మొదటి సారి అని అనసూయ చెప్పింది. ఈ మ్యాచ్ను జీవితాంతం గుర్తుకు ఉంచుకుంటానంది. ‘స్టేడియంలో మ్యాచ్ చూడడం ఇదే తొలిసారి. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్ను జీవితాంతం గుర్తుంచుకునేలా చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్ ఇలాగే దూసుకువెళ్లాలి. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, టీమ్ రాజస్థాన్ రాయల్స్ చాలా చక్కగా ఆడారు. ఏంటా క్లైమాక్స్!!! గ్రేట్ గ్రేట్ మ్యాచ్.’ అంటూ అనసూయ తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa