ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమె ఇచ్చిన ధైర్యంతోనే చిత్రీకరణ పూర్తి చేశా : కీర్తి సురేశ్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 31, 2024, 01:01 PM

 తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలతో అలరిస్తోన్న కీర్తి సురేశ్‌ 'బేబీ జాన్‌'తో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రంలో అవకాశం గురించి కీర్తి  మాట్లాడుతూ.. సమంతకు థాంక్స్ చెప్పారు. ఆమె వల్లే ఈ చిత్రంలో తనకు అవకాశం వచ్చిందన్నారు. 'తెరి' సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. దీని తమిళ వెర్షన్‌లో హీరోయిన్‌గా సమంత నటించారు.''బేబీ జాన్‌' సినిమా హిందీలో రీమేక్‌ చేయాలని చిత్రబృందం భావించగానే సమంత (Samantha) నా పేరు చెప్పారు. తమిళంలో ఆమె పోషించిన పాత్రను హిందీలో నేను చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. ఈ విషయంలో సమంతకు కృతజ్ఞతలు. 'తెరి'లో సమంత నటన నాకెంతో ఇష్టం. నిజాయతీగా చెప్పాలంటే ఈ రీమేక్‌ కోసం సమంత నాపేరు చెప్పగానే భయపడ్డాను. కానీ, ఆమె ఎంతో మద్దతు ఇచ్చారు. చిత్రబృందం నా పేరు వెల్లడించగానే 'నువ్వు తప్ప ఈ పాత్రను మరెవ్వరూ చేయలేరు' అని తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టారు. ఆ సందేశం నాలో నమ్మకాన్ని పెంచింది. ఉత్సాహంగా దీని షూటింగ్‌లో పాల్గొన్నా. ఆమె ఇచ్చిన ధైర్యంతోనే చిత్రీకరణ పూర్తి చేశా. ఆమె స్ఫూర్తితోనే ముందుకుసాగుతున్నా'' అని వివరించారు.


గతంలో కీర్తి సురేశ్‌, సమంత 'మహానటి'లో కలిసి నటించారు. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఆ చిత్రంలో సమంత జర్నలిస్ట్‌గా కనిపించగా.. కీర్తి సావిత్రిగా ఆకట్టుకున్నారు. కీర్తి తన పాత్రకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ఇక 'బేబీ జాన్‌' విషయానికొస్తే.. కాలీస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకువచ్చింది. వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan), కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించగా వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్‌ కీలకపాత్రలు పోషించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa