బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ ఇటీవల ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘పీకే’ సినిమా సమయంలో తలెత్తిన 'లవ్ జిహాద్' ఆరోపణలు, తన దేశభక్తిపై వస్తున్న విమర్శల గురించి ఆయన వివరణ ఇచ్చారు.అన్ని మతాంతర వివాహాలను ‘లవ్ జిహాద్’ కోణంలో చూడటం సరికాదని ఆమిర్ ఖాన్ అన్నారు. "రెండు మతాలకు చెందిన వారు ప్రేమించుకుని, వివాహం చేసుకుంటే అది అన్నిసార్లు లవ్ జిహాద్ కాదు. ఒకరినొకరు ఇష్టపడి మనుషులుగా ఒక్కటయ్యారు. అది మతాలకు అతీతం" అని ఆయన అభిప్రాయపడ్డారు.తన కుటుంబంలో కూడా ఇలాంటి వివాహాలు జరిగాయని గుర్తుచేశారు. "మా అమ్మాయి ఐరా.. నుపుర్ శిఖరే అనే హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నా సోదరి నిఖత్.. సంతోష్ హెగ్డేను, చిన్న సోదరి ఫర్హాన్.. రాజీవ్ దత్త్ను వివాహం చేసుకున్నారు" అని తెలిపారు. ‘పీకే’ సినిమా ఏ మతానికి వ్యతిరేకం కాదని, మతం పేరుతో అమాయకులను మోసం చేసే వ్యక్తుల గురించి మాత్రమే ఆ చిత్రంలో చూపించామని, అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.పహల్గామ్ దాడి తర్వాత బాలీవుడ్లోని ఖాన్ త్రయం స్పందించలేదంటూ సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలపైనా ఆమిర్ పరోక్షంగా స్పందించారు. భారతీయ సినీ చరిత్రలో తొలిసారి పాకిస్థాన్ను శత్రుదేశంగా చూపించింది తన చిత్రంలోనేనని ఆయన గుర్తుచేశారు. 1999లో తాను నటించిన ‘సర్ఫరోష్’లో ‘పొరుగు దేశం’ అంటూ పాకిస్థాన్ను ఉద్దేశించి ప్రస్తావించామని తెలిపారు. "ఆ సినిమా విడుదల తర్వాత పాకిస్థాన్ నుంచి చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి" అని ఆమిర్ అన్నారు.దేశ ప్రయోజనాల విషయంలో తాను ఎప్పుడూ ముందుంటానని, ఆర్థిక నష్టాలు వచ్చినా వెనుకాడనని ఆమిర్ ఖాన్ పేర్కొన్నారు. ‘దంగల్’ సినిమాను పాకిస్థాన్లో విడుదల చేసేందుకు అక్కడి సెన్సార్ బోర్డు కొన్ని షరతులు విధించిందని గుర్తుచేశారు. "ముఖ్యంగా గీతా ఫొగాట్ విజేత అయిన మ్యాచ్లో మువ్వన్నెల జెండా కనిపించకూడదని, జాతీయ గీతం వినిపించకూడదని వాళ్లు షరతులు పెట్టారు. ఇది విన్న వెంటనే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ సినిమాను పాకిస్థాన్లో విడుదల చేయటం లేదని చెప్పేశాను. మన వ్యాపారంలో నష్టం వస్తుందని డిస్నీ వాళ్లు అన్నారు. జాతీయ జెండా, గీతం తీసేసి చేసే బిజినెస్, వచ్చే డబ్బులు నాకు వద్దని స్పష్టం చేశాను" అని ఆమిర్ వివరించారు.‘దంగల్’ చిత్రానికి భారతదేశంలోనే అధిక వసూళ్లు వచ్చాయని, ఈ సినిమాతో పాటు ‘సీక్రెట్ సూపర్స్టార్’ కూడా చైనాలో మంచి ఆదరణ పొందిందని ఆమిర్ తెలిపారు. ఆ చిత్రాలు విడుదలైనప్పుడు చైనాతో మనకు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని, స్నేహభావమే ఉందని అన్నారు. కార్గిల్ యుద్ధం తర్వాత తాను ఎనిమిది రోజుల పాటు లెహ్తో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించి, మన సైనికులను ప్రోత్సహించేందుకు పలు ఆర్మీ రెజిమెంట్లకు వెళ్లినట్లు వెల్లడించారు. వారితో కలిసి భోజనం చేయడమే కాకుండా, యుద్ధ సమయంలో వారు ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను అడిగి తెలుసుకున్నానని, దాదాపు ఏడెనిమిది రాత్రులు బంకర్లలోనే ఉన్నానని ఆమిర్ గుర్తు చేసుకున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa